మాకైతే ఢోకా లేదు..!

by  |
మాకైతే ఢోకా లేదు..!
X

దిశ, కరీంనగర్: రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపుల్లో ఉన్న స్టాక్ వివరాలు సేకరించడానికి అసలు కారణం వేరే ఉందా? రాష్ట్ర ప్రభుత్వం హుటాహుటిన లిక్కర్ బాటిళ్ల లెక్కలు తెప్పించుకోవడానికి అసలు కారణంగా ఏంటో తెలుసా? అయితే ఈ స్టోరీ చదవండి. లాక్ డౌన్ కు ముందు, తరువాత బ్రాందీ షాపుల వారీగా లిక్కర్ స్టాక్ వివరాలు పంపాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించింది. దీంతో రాష్ట్రంలోని ఎక్సైజ్ అధికారులు ఆ వివరాలను సేకరించి ప్రభుత్వానికి పంపించారు. వైన్ షాపుల్లో ఉన్న స్టాక్ వివరాలు అడగగానే ప్రభుత్వం చట్టపరమైన చర్యలకు శ్రీకారం చుడుతుందని అందరూ భావించారు. లాక్ డౌన్ సమయంలో మద్యాన్ని దారి మళ్లించి అక్రమాలకు పాల్పడిన షాపుల లైసెన్స్ లు రద్దు చేస్తారన్న ప్రచారం జోరుగా సాగింది.

అసలు కారణం ఏమిటంటే..

ప్రభుత్వం లిక్కర్ స్టాక్ వివరాలు తెప్పించుకోవడానికి అసలు కారణం ఏమిటంటే.. పెంచిన ధరలతో లిక్కర్ అమ్మించాలని భావించింది. అయితే వైన్ షాపుల్లో ఉన్న స్టాక్ వివరాలు కూడా సేకరించి ఆ స్టాక్ కు సంబంధించిన అదనపు ధరలు కూడా ప్రభుత్వానికి చెల్లించాలన్న ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఉన్న ధరలకు 16 శాతం ఎక్కువగా పెంచి మద్యాన్ని విక్రయించాలని నిర్ణయించినట్టు సీఎం కేసీఆర్ కూడా ప్రకటించారు. ఐఎంఎల్ డిపోల నుంచి ఇప్పుడు వైన్ షాపులకు వెళ్లే లిక్కర్ లెక్కలతో అడిషనల్ ట్యాక్స్ ను వసూలు చేయవచ్చు కానీ, వైన్ షాపుల్లో ఉన్న నిలువ వివరాలు సరిగా దొరకవని భావించిన ప్రభుత్వం దుకాణాల వారీగా వివరాలు సేకరించింది.

మింగలేక.. కక్కలేక…

లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మద్యం ప్రియుల అవసరాలను ఆసరాగా చేసుకున్న వ్యాపారులు అడ్డగోలు ధరలకు మద్యాన్ని నల్లబజారులో విక్రయించారన్న ఆరోపణలు ఉన్నాయి. చాలా చోట్ల వైన్ షాపుల్లోని మద్యం కార్టన్లకు కాళ్లొచ్చి బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టాయన్నది వాస్తవం. కొన్ని చోట్ల లిక్కర్ అక్రమంగా బయటకు వచ్చినట్టు కేసులు కూడా నమోదయ్యాయి. అయితే ప్రభుత్వం అనూహ్యంగా మద్యం వివరాలను అడగడంతో క్రిమినల్ చర్యలకు పాల్పడితే కష్టమని భావించిన వ్యాపారులు తమ వద్ద ఉన్న స్టాక్ కన్నా ఎక్కువగా ఉన్నట్టు చూపించారని తెలుస్తోన్నది. లాక్ డౌన్ కు ముందు ఉన్న స్టాక్ వివరాలను, ఇప్పటి వివరాలను పోల్చితే తాము ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని భావించిన కొందరు వ్యాపారులు అప్పటి రికార్డుల ప్రకారమే తమ షాపుల్లో మద్యం ఉందని చూపించినట్టు ప్రచారం జరుగుతోన్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అనూహ్యంగా పాత స్టాక్ కు కూడా ట్యాక్స్ చెల్లించాలని ఆదేశించడంతో మద్యం వ్యాపారులు అదనపు ట్యాక్స్ కడుతున్నారు. లాక్ డౌన్ సమయంలో గుట్టుగా విక్రయించిన లిక్కర్ కూడా షాపులోనే ఉన్నట్టు చూపించిన కొంతమంది వ్యాపారులు ఆ మద్యానికి కూడా 16 శాతం అడిషనల్ ట్యాక్స్ పే చేస్తున్నారని సమాచారం. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ గణాంకాల వివరాల అనంతరం పలు జిల్లాల ఎక్సైజ్ అధికారులు మాట్లాడుతూ రిటేల్ షాపుల్లో మద్యం సరిగానే ఉందని బాహాటంగానే కామెంట్ చేయడమే లాక్ డౌన్ కు ముందు స్టాక్ ఉన్నట్టుగా నివేదికలు పంపినట్టు స్పష్టం అవుతోన్నది.

చర్యలు ఉండేనా..?

అయితే లాక్ డౌన్ సమయంలో మద్యం అక్రమంగా వైన్ షాపుల్లోంచి బయటకు వచ్చిందన్న ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం స్టాక్ వివరాలు సేకరించి 16 శాతం అదనపు ట్యాక్స్ వసూలు చేయడంతో అసలు చర్యలు ఉంటాయా లేదా అన్న అనుమనాలు రేకెత్తుతున్నాయి. ఎక్సైజ్ నిబంధనలతోపాటు, లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారని చట్టపరమైన చర్యలు తీసుకుంటారని భావించినప్పటికీ చివరకు ప్రభుత్వం అదనపు ట్యాక్స్ వసూలు చేస్తుండడంతో తప్పు చేసిన వైన్ షాపులపై చర్యలు ఉంటాయా లేదా అన్న చర్చ సాగుతోన్నది. వైన్ షాపుల యజమానులు అడిషనల్ ట్యాక్స్ చెల్లించడం కూడా తమకు కలిసొచ్చిందని ఫీలవుతున్నారు. అధికారికంగా తాము ప్రభుత్వానికి చూపించి మరీ ట్యాక్స్ చెల్లించాం కాబట్టి ఇక తమకు ఢోకా లేదన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశమే లేదని భావిస్తున్నారు. ముందు ముందు ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తోందో చూడాలి మరీ.

tags: Karimnagar, Tax, Excise Department, Wine Shops, Liquor Stock Details, CM KCR

Next Story