విద్యార్థులకు కుళ్లిపోయిన అన్నం.. సబితమ్మ ఏంటిది అంటూ పేరెంట్స్ ఫైర్

by  |
విద్యార్థులకు కుళ్లిపోయిన అన్నం.. సబితమ్మ ఏంటిది అంటూ పేరెంట్స్ ఫైర్
X

దిశ, ఎల్బీనగర్ : సరూర్ నగర్ పరిధి పంజాల అనిల్ కుమార్ కాలనీలో ఏర్పాటైన మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ హాస్టల్‌లోని 5,6,7వ తరగతులకు చెందిన విద్యార్థులు శుక్రవారం రాత్రి అన్నం తిన్న తర్వాత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే బాధిత విద్యార్థులను 108 అంబులెన్స్‌లో ఉస్మానియాకు తరలించారు. అక్కడ అడ్మిట్ చేసుకోకపోవడంతో నీలోఫర్‌కి తరలించి ట్రీట్​మెంట్​ అందిస్తున్నారు. సొసైటీ హాస్టల్‌లో ఐదో తరగతి నుంచి ఇంటర్ వరకు 950 మంది విద్యార్థులు చదువుతున్నారు. వారం రోజులుగా హాస్టల్‌లో తాగునీరు, ఇతర అవసరాలకు నీరు లేకపోగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పలువురు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

5 రోజులుగా స్నానాలు, కనీసం టాయిలెట్​కు వెళ్లేందుకు కూడా నీరు లేదని వాపోయారు. స్నానాలు చేయకపోవడంతో అలర్జీ, జ్వరాలు వచ్చి అస్వస్థతకు గురైనట్లు విద్యార్థులు తెలిపారు. హాస్టల్‌లో నీటి సమస్యపై ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. కుళ్ళిపోయిన కూరగాయలు, ముక్కిపోయిన బియ్యంతో వండి పెడుతున్నారని విద్యార్థులు తెలిపారు. శుక్రవారం రాత్రి కుళ్ళిపోయిన కూరగాయలతో వండిన అన్నం తిన్న తర్వాత తాగునీరు లేక బోరు నీరు తాగడం వల్ల విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అందులో 19 మందిని ఆసుపత్రికి తరలించినట్లు విద్యార్థులు తెలిపారు. ఆసుపత్రిలో అడ్మిట్ అయిన విద్యార్థుల పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు, ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నట్లు నీలోఫర్ డాక్టర్లు చెప్పారు. హాస్టల్‌లోని సమస్యలు, విద్యార్థుల అస్వస్థతపై హాస్టల్ ఇన్​చార్జి‌ని వివరణ కోరగా, దానికి నిరాకరించడంతో పలు అనుమానాలకు తావిస్తోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదేనా బంగారు తెలంగాణ

కుళ్ళిపోయిన కూరగాయలు, ముక్కిపోయిన బియ్యంతో వండిన అన్నం తినడం, తాగునీరు లేక బోరు నీళ్లు తాగడం వల్ల చిన్నారులు నీలోఫర్ ఆసుపత్రిలో విలవిలలాడుతున్నారని సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అంజన్ ఆందోళన వ్యక్తం చేశారు. విద్యా శాఖ మంత్రి సొంత నియోజకవర్గంలోనే ఈ పరిస్థితులు చోటు చేసుకోవడంతో సబితమ్మ మీకు కనిపించడం లేదా అని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నించారు. ఇదేనా మన బంగారు తెలంగాణ.. దీనికి సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed