అక్కడి నుంచి చైనా వెళ్లడం లేదు

by  |
అక్కడి నుంచి చైనా వెళ్లడం లేదు
X

న్యూఢిల్లీ: భారత్, చైనా సరిహద్దులో ఉద్రిక్తతలు నెలకొన్న ఫ్యాంగాంగ్ సో పైనే ఇప్పుడందరి దృష్టి ఉన్నది. ఈ ఏరియా నుంచి చైనా సైన్యం ఇంకా వెనక్కి వెళ్లకపోవడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఏప్రిల్ నుంచి సరిహద్దులో గోగ్రా పోస్టు సమీపంలోని పెట్రోలింగ్ పాయింట్(పీపీ) 17ఏ, గాల్వన్ లోయలోని పీపీ 14, హాట్‌స్ప్రింగ్స్ సెక్టార్‌లోని పీపీ 15, ప్యాంగాంగ్ సో ఏరియాలో పీపీ4 దగ్గర ఉద్రిక్తతలు కొనసాగాయి. చైనాతో శాంతిచర్చల్లో కుదిరిన ఒప్పందానికి అనుగుణంగా ఇరుదేశాల సైన్యం పీపీ 17ఏ, పీపీ 14, పీపీ 15 నుంచి సుమారు రెండు కిలోమీటర్ల దూరం వెనక్కి మళ్లాయి.

కానీ, భారత్ కచ్చితంగా తమదేనని చెప్పిన పీపీ 4 నుంచి మాత్రం డ్రాగన్ సైన్యం వెనక్కి తగ్గలేదు. ప్రస్తుతం మూడు చోట్ల నుంచి ఉపసంహరించుకున్న బలగాల మొత్తం కేవలం ప్యాంగాంగ్ సో ఏరియాలోనే మోహరించి ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ఫింగర్ 8 దగ్గర ఎల్ఏసీ పోతుందని, అక్కడివరకు తమ భూభాగమేనని భారత్ వాదిస్తున్నది. కాగా, ఫింగర్ 8 నుంచి ఫింగర్ 4 వరకు చొచ్చుకొచ్చిన చైనా సైన్యం ఇంకా అక్కడే తిష్ట వేసి కూర్చుంది. దీంతో ఈ ఏరియా నుంచి చైనా సైన్యం ఉపసంహరణ కోసం మరోసారి ఇరుదేశాల మధ్య చర్చలు సాగుతాయని అధికారులు భావిస్తున్నారు.

కాగా, ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందానికి అనుగుణంగా బలగాల ఉపసంహరణ సాగుతున్నదని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జావో లిజియన్ తెలిపారు. గాల్వన్ సహా ఇతర ప్రాంతాల నుంచి ఇరుదేశాల సైన్యం ప్రభావవంతంగా వెనక్కి మళ్లుతున్నదని, ప్రస్తుతం సరిహద్దులో పరిస్థితులు నిలకడగా ఉన్నాయని పేర్కొన్నారు. కాగా, ఉపసంహరణ ప్రక్రియ ముగిసేవరకు ఇరుదేశాల సైన్యం ఆ ఏరియాలో పెట్రోలింగ్ చేపట్టవద్దని అంగీకరించిన సంగతి తెలిసిందే.



Next Story

Most Viewed