ప్రాజెక్టులకు పోటెత్తిన వరద

by  |
ప్రాజెక్టులకు పోటెత్తిన వరద
X

దిశ, న్యూస్ బ్యూరో : శ్రీశైలం ప్రాజెక్టులోకి కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. ఎగువ నుంచి ఆదివారం సాయంత్రం 174521 క్యూసెక్కులు చేరుతుండగా రాత్రి 12 గంటలకు ఇది రెండు లక్షల క్యూసెక్కులకు పెరుగుతుందని అధికారవర్గాలు తెలిపాయి. ఎగువ నుంచి భారీ వరదలు కొనసాగుతుండటంతో శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల నిండవచ్చని అంచనా వేస్తున్నారు.

పశ్చిమ కనుమల్లో ప్రధానంగా కృష్ణా, ఉపనదుల పరీవాహక ప్రాంతాల్లో నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం భారీ వర్షపాతం నమోదైంది. దాంతో కృష్ణా, ఉపనదుల్లో గంట గంటకూ వరద పెరుగుతోంది. ఎగువ నుంచి ఆల్మట్టిలోకి వరద పెరుగుతుండటంతో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్‌డీఎంఏ) సూచనల మేరకు డ్యామ్‌ నీటి నిల్వలను ఖాళీ చేసి దిగువకు విడుదల చేస్తున్నారు. అల్మట్టికి 1.68 -లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా, దిగువకు 2.02 లక్షల క్యూసెక్కులను వదులుతున్నారు.

నారాయణపూర్‌ డ్యామ్‌లోనూ అదే పరిస్థితి. నారాయణపూర్ రిజర్వాయరుకు 2.12 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా, 2.09 లక్షల క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉంది. ప్రస్తుతం జూరాలకు భారీగా వరద కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 2.11 లక్షల క్యూసెక్కులు ఉండగా, జూరాల నుంచి 2.14 లక్షల క్యూసెక్కుల వరదను దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం ఎడమగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు జలాలు విడుదల చేస్తుండటంతో నాగార్జునసాగర్‌ నీటిమట్టం 558.20 అడుగులకు చేరుకుంది. శ్రీశైలం నుంచి ఔట్ ఫ్లో
46 వేల క్యూసెక్కులు ఉండగా సాగర్‌కు 35వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది.

అప్పర్‌ తుంగభద్ర డ్యామ్, సింగటలూరు బ్యారేజీ నుంచి భారీ వరదను దిగువకు వదులుతుండటంతో తుంగభద్రలోకి వరద ప్రవాహం పెరుగుతోంది. తుంగభద్రకు 1.08 లక్షల క్యూసెక్కులు చేరుతున్నాయి.
మరోవైపు గోదావరి పరీవాహక ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటం, ఉపనదులు ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరు, కిన్నెరసాని నుంచి నీటి ప్రవాహం చేరుతుండటంతో గోదావరిలో వరద ఉధృతి పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీలోకి 1.18 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా 7 వేల క్యూసెక్కులు డెల్టాకు, మిగిలిన 1.11 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. పెరూరు దగ్గర 77వేల క్యూసెక్కులు నమోదవుతున్నాయి.

Next Story

Most Viewed