ఆడుకునేందుకు వెళ్ళి.. నీటి గుంతలో శవమై తేలిన బాలుడు

by  |
ఆడుకునేందుకు వెళ్ళి.. నీటి గుంతలో శవమై తేలిన బాలుడు
X

దిశ ప్రతినిధి, మేడ్చల్ : నీటి గుంటలో పడి బాలుడు మృతి చెందాడు. ఈ హృదయ విదారక ఘటన మేడ్చల్ జిల్లా శామీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రాజ్‌కుమార్, సునీల్ కుమార్ యాదవ్‌లు భార్య పిల్లలతో కలిసి తుర్కపల్లి సమీపంలోని సన్ ఫార్య్చూన్ వెంచర్‌లో ఉంటూ జీవనం సాగిస్తున్నారు. రాజ్‌కుమార్ కుమారుడు యువరాజ్ యాదవ్ (5), సునీల్ కుమార్ కుమారుడు ధన్ కుమార్‌లు బుధవారం సాయంత్రం 4 గంటలకు అడుకునేందుకు బయటకు వెళ్లారు.

సునీల్ కుమారుడు ధన్ కుమార్ తిరిగి ఇంటికి రాగా, రాజ్ కుమార్ కుమారుడు యువరాజ్ యాదవ్ ఇంటికి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు చుట్టు పక్కల ప్రాంతాల్లో వెతికారు. అయినా యువరాజ్ ఆచూకీ తెలియరాలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. బుధవారం రాత్రి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ ఫుటేజీలను పరిశీలించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. చివరకు సమీపంలోని నీటి గుంతలో పడి యువరాజ్ యాదవ్ మృతి చెందినట్టు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు బాలుడి మృత దేహాన్ని గుంతలో నుంచి బయటకు తీశారు. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.



Next Story

Most Viewed