మాంద్యం పరిస్థితులు తప్పవన్న ఫిచ్ రేటింగ్స్!

by  |
మాంద్యం పరిస్థితులు తప్పవన్న ఫిచ్ రేటింగ్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ రేటింగ్స్ భారత వృద్ధిరేటుపై సంచలన వివరాలు వెల్లడించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు కేవలం 0.8 శాతమే నమోదవుతుందని అభిప్రాయపడింది. సరిగ్గా 3 వారాలకు ముందు వృద్ధి అంచనాను 2 శాతం అని చెప్పగా, ఇప్పుడు దాన్ని 0.8 శాతానికి తగ్గించేసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులౌ చూస్తే యుద్ధానంతర కాలానికి ముందున్న అసాధారణ మాంద్యలాంటిదని ఫిచ్ రేటింగ్స్ పేర్కొంది. కొవిడ్-19 వ్యాప్తితో పాటు లాక్‌డౌన్ కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళ్లనున్న నేపథ్యంలో ఆ ప్రభావం ఇండియాపై కూడా ఉంటుందని సంస్థ వ్యాఖ్యానించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో వరుస రెండు త్రైమాసికాల్లోనూ ప్రతికూల వృద్ధి ఉంటుందని, అయితే.. పరిస్థితులు చక్కబడ్డాక 2021-22 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 6.7 శాతానికి పెరిగే అవకాశముందని తెలిపింది.

ముఖ్యంగా ఆర్థిక పతనం అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల జీడీపీని మరింత దిగజారుతుందని తెలిపింది. కరోనా వైరస్ సంక్షోభం అంతర్జాతీయ ఆర్థికవ్యవస్థపై తీవ్రమైన ప్రభావాన్ని చూపించే అవకాశముందని, సరఫరా వ్యవస్థపై ప్రతికూల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉందని, ఎగుమతుల పరిస్థితిలోనూ ఎలాంటి సానుకూల పరిణామాలు లేవని ఫిచ్ రేటింగ్స్ వివరించింది. మూలధన ప్రవాహాలు, వస్తువుల ధరలు పడిపోతుండటం, పరిమితమవుతున్న పాలసీ విధానాలు దేశీయంగా వైరస్ నియంత్రణ చర్యల ప్రభావాన్ని పెంచుతున్నాయని పేర్కొంది. ఇండియాతో పాటు చైనా వృద్ధి కూడా ఒక శాతం లోపు ఉండొచ్చని ఫిచ్ రేటింగ్స్ సంస్థ అంచనా వేసింది. 2020 ఏడాదిలో ఇండియా జీడీపీ మరింత దిగజారే అవకాశముందని, 1980 సంవత్సరం నాటి విపత్కర పరిస్థితి ఇదని తెలిపింది.

Tags: india, gdp growth, Fitch Ratings, India latest Updates, indian economy, coronavirus

Next Story

Most Viewed