రాష్ట్రంలో క్షీర, శ్వేత, నీలి విప్లవాలు వస్తాయి: కేటీఆర్

by  |
రాష్ట్రంలో క్షీర, శ్వేత, నీలి విప్లవాలు వస్తాయి: కేటీఆర్
X

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులన్నీ పూర్తవుతుండటంతో అనేక ప్రయోజనాలు కలుగుతాయని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వమే ఉచితంగా చేప పిల్లలను విడుదల చేస్తుండటం వల్ల రానున్న రోజుల్లో మత్స్య సంపద వృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్రంలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలపై మంత్రులు మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పలు సూచనలు చేశారు. గొర్రెల పంపిణీతో వచ్చే రోజుల్లో మాంసం ఉత్పత్తి కూడా భారీగా పెరిగే అవకాశం ఉన్నందున పశుసంవర్ధక శాఖ, పరిశ్రమల శాఖ సమన్వయంతో ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రణాళికలను ఇప్పటి నుండే రూపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పశు సంవర్ధక శాఖ తరపున చేపట్టే ఏ కార్యక్రమానికి అయినా అన్ని విధాలుగా సహకరిస్తామని, ఇలాంటి కార్యక్రమాల కోసం తన సిరిసిల్ల జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపట్టాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న జల విప్లవం వలన పాలు, మాంసం, మత్స్య సంపద ఉత్పత్తి పెద్దఎత్తున పెరిగి క్షీర, శ్వేతా, నీలి విప్లవాలు తెలంగాణలో వస్తాయని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ దిశగా పశుసంవర్ధక శాఖ, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖలతో కలిసి పరిశ్రమల శాఖ ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో మరిన్ని పెట్టుబడులు తీసుకువచ్చేందుకు, ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రయత్నం చేస్తుందని మంత్రి కేటీఆర్ వివరించారు. రాష్ట్రంలోని శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులకు తమ శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరిస్తూ లేఖలు పంపుతామని మంత్రి శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి హామీ పథకం ద్వారా పంపాండ్‌ల నిర్మాణం చేపట్టడం ద్వారా స్వయం ఉపాధి అవకాశాలను కల్పిస్తామని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. ఈ సమీక్షలో పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, మత్స్య శాఖ కమిషనర్ సువర్ణ, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ లక్ష్మారెడ్డి, విజయ డెయిరీ ఎండీ శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed