మత్య్సకారుల పొట్ట కొట్టొద్దు.. ఉత్తర్వులను కలెక్టర్ వెనక్కి తీసుకోవాలి

by  |
Fishermens association
X

దిశ, ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం చిన్న చెరువులో అధికారులు పార్కును నిర్మించడం హేయమైన చర్య అని, స్థానిక తహసీల్దార్‌తో మాట్లాడి వెంటనే కలెక్టర్ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని మత్య్స కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోరెంకల నర్సింహా డిమాండ్ చేశారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో మత్స్య కార్మిక సంఘం 20 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా వార్షికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గోరెంకల నర్సింహా మాట్లాడుతూ.. ప్రభుత్వం చెరువులు, కుంటలు లీజుకు ఇవ్వడం తగ్గించాలని సూచించారు. ప్రతీ సోసైటీకి నాణ్యమైన 3 అంగుళాల చేప పిల్లలు ఉచితంగా ఇవ్వాలని, చేపల మార్కెట్లు నిర్మించాలని, మత్స్యకారులకు పూర్తిస్థాయిలో మోటర్ సైకిల్స్ ఇవ్వాలని సొసైటీ తరపున పోరాటం చేశామని గుర్తుచేశారు. దాని ఫలితంగా రాష్ట్రం ఏర్పడ్డాక ఇప్పుడు మత్స్యకారులు ఫలితాలు పొందుతున్నారని అన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రంలో హైదరాబాద్‌ వైపు వేళ్లే సాగర్ రోడ్డు పక్కన ఉన్న చిన్న చెరువులో అధికారులు పార్కును నిర్మించడం తగదని అన్నారు.

ఈ విషయమై తహసీల్దారుతో మాట్లాడితే, మాకు తెలీదని జిల్లా కలెక్టర్ అనుమతులు ఇచ్చారని చెప్పడం బాధాకరమని వెల్లడించారు. కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని మత్య్సకార సంఘం నేతలు డిమాండ్ చేశారు. నీళ్లు పారే అలుగు వద్ద పార్కు ఎలా కడతారని ప్రశ్నించారు. చెరువులు, కుంటలు కబ్జాలు కాకుండా చూడాల్సిన కలెక్టర్ ఇలా ఉత్తర్వులు ఇవ్వడం సబబు కాదని అన్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ ఏడాది ఎనిమిది లక్షలకు పైగా చేప పిల్లలను చిన్న చెరువులో వదిలామని, అందులో పార్కును నిర్మిస్తే మా పరిస్థితి ఏంటని, అధికారులు మా పొట్ట కొట్టొద్దని స్థానికులు వాపోయారు. రాష్ట్రవ్యాప్తంగా మత్య్సకారుల సమస్యల పరిష్కరించడానికి హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జాతీయస్థాయి మత్స్యకారుల సమావేశం మూడ్రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో మత్య్సకార సంఘం జిల్లా అధ్యక్షులు శంకర్, జిల్లా నాయకులు భిక్షపతి, శేఖర్, పొన్నల శంకర్, నర్సింహా, పరమేశ్, రాములు, సురయ్య పాల్గొన్నారు.

Next Story