ఖేలా హోబె.. రెండు రాష్ట్రాలలో తొలి ఎన్నికల సమరం షురూ..

by  |
begal, assam first phase elections
X

దిశ, వెబ్‌డెస్క్: దేశం మొత్తాన్ని ఆకర్షిస్తున్న పశ్చిమబెంగాల్, ఈశాన్య రాష్ట్రం అసోంలలో తొలి విడత ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ భాషలో చెప్పాలంటే ఖేలా హోబె (ఆట మొదలైంది). బెంగాల్‌‌లోని ఐదు జిల్లాల పరిధిలోని 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో.. ఎగువ, మధ్య అసోం జిల్లాలలోని 47 అసెంబ్లీ సెగ్మెంట్లలో మొదటి దశ ఎన్నికల పోలింగ్ శనివారం ఉదయం 7 గంటలకే ప్రారంభమైంది.

రెండు రాష్ట్రాలలో పోలింగ్ ప్రారంభమయ్యే సమయానికే పెద్ద ఎత్తున ప్రజలు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. అసోంలో ఓటర్లను ఆకర్షించేందుకు పోలింగ్ కేంద్రాల ఎదుట ఆకట్టుకునే డెకరేషన్ ఏర్పాటు చేశారు అధికారులు. అసోంలో తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవాలని యోచిస్తున్న బీజేపీ.. బెంగాల్‌లో ఈసారి ఎలాగైనా పాలనా పగ్గాలు చేపట్టాలని ప్రణాళికలు రచిస్తున్నది. ఇక బెంగాల్‌లో మరోసారి దీదీనే పాగా వేయనున్నదని సర్వేలు వెల్లడిస్తున్నాయి. కాగా.. ఎన్నికల నేపథ్యంలో యువత పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొనాలని ప్రధాని మోడీ ట్విట్టర్ ద్వారా కోరారు.

రెండు రాష్ట్రాలలో జరిగే అసెంబ్లీ ఎన్నికలపై ముఖ్య విశేషాలు..

  • బెంగాల్‌లోని ఐదు జిల్లాలలో ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. పురులియా, ఝర్గ్రామ్ లోని మొత్తం నియోజకవర్గాలు.. బంకుర, వెస్ట్ మిడ్నాపూర్, ఈస్ట్ మిడ్నాపూర్‌లలోని పలు శాసనసభ సెగ్మెంట్లలో ఎన్నికలు జరుగుతున్నాయి.
  • 73 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం ఎన్నికల కమిషన్ 10,200 బూత్‌లను ఏర్పాటు చేసింది.
  • బెంగాల్‌లో ప్రస్తుతం జరుగుతున్న 30 స్థానాలలోనూ అధికార త‌ృణమూల్ కాంగ్రెస్ 2016లో 26 స్థానాల్లో గెలుపొందింది.
  • 30 స్థానాలకు గాను బీజేపీ, టీఎంసీలు చెరో 29 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. మిగతా ఒక్క స్థానాన్ని మిత్ర పక్షాలకు కేటాయించాయి. కాంగ్రెస్ ఐదు స్థానాల్లో పోటీ చేస్తుండగా, సీపీఐ 4, సీపీఐ(ఎం)18 నియోజకవర్గాల్లో పోటీకి నిలిచింది.

assembly elections

  • ఇక అసోం విషయానికొస్తే.. 81 లక్షల మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.
  • 2016 అసెంబ్లీ ఎన్నికలలో 47 సీట్లలో బీజేపీ 35 గెలిచింది. ప్రస్తుత ఎన్నికలలో బీజేపీ 39 స్థానాల్లో పోటికి దిగుతుండగా.. అసోం గణ పరిషత్ (ఏజీపీ) 10 స్థానాల్లో (రెండు స్థానాల్లో ఇరు పార్టీల అభ్యర్థులు పోటీకి నిలిచారు) బరిలో ఉంది. కాంగ్రెస్ 43 స్థానాల్లో పోటి చేస్తుంది.
  • అసోం సీఎం సర్బనంద సోనొవాల పోటీ చేస్తున్న మజోలిలో తొలి దశలోనే ఎన్నికలు జరుగుతున్నాయి. ఆయనతో పాటు కాంగ్రెస్ స్టేట్ చీఫ్ రిపున్ బోరా, అసెంబ్లీ స్పీకర్ హితేంద్రనాథ్ గోస్వామి కూడా నేడు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
  • పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా పోరాటం చేసి జైలు పాలైన ప్రముఖ ఉద్యమకారుడు, రాయిజోర్ దళ్ చీఫ్ అఖిల్ గొగోయ్ శివసాగర్ నుంచి పోటీలో ఉన్నాడు. ఈ నియోజకవర్గంలోనూ పోలింగ్ జరుగుతున్నది.

Next Story