ఇన్ఫోసిస్ సీఈఓకు సమన్లు జారీ ?

by  |
infosis
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ టెక్ సంస్థ ఇన్ఫోసిస్ సీఈఓ, ఎండీ సలీల్ పరేఖ్‌కు కేంద్ర ఆర్థిక శాఖ సమన్లు జారీ చేసింది. అదాయపు పన్ను శాఖ కొత్త వెబ్‌సైట్ ప్రారంభమై 2 నెలలు గడిచినప్పటికీ సాంకేతిక సమస్యలకు పరిష్కారం లేకపోవడంతో వివరణ ఇవ్వాలని మంత్రిత్వ శాఖ ఆదేశించింది. లోపాలను పరిష్కరించడంలో ఉన్న ఇబ్బందులేంటని ఇన్ఫోసిస్ సీఈఓకు జారీ చేసిన సమన్లలో కోరింది.

గతవారం 21న కొత్త ఈ-ఫైలింగ్ పోర్ట్ అందుబాటులో లేకుండా సమస్య ఉత్పన్నమైన విషయాన్ని కూడా ఆర్థిక శాఖ గుర్తు చేసింది. దీనికి సంబంధించి సోమవారం(ఆగష్తు 23) ఆర్థిక మంత్రికి వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ ఏడాది జూన్ 7న రిటర్నుల ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు కేంద్ర ఆర్థిక శాఖ కొత్త వెబ్‌సైట్‌ను తీసుకొచ్చింది. అయితే, ప్రారంభం నుంచే ఈ పోర్టల్ పలు లోపాల వల్ల సమస్యలను తెచ్చి పెడుతోంది. మొదటినుంచి పన్ను చెల్లింపుదారుల నుంచి అనేక ఫిర్యాదులు కూడా అందుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు సుమారు 2 వేల లోపాలకు సంబంధించి ఫిర్యాదులు అందగా, వీటిలో 90 కొత్త రకాల సమస్యలు ఉన్నాయని తేలింది.

వీటికి సంబంధించి ఆర్థిక శాఖ ఎప్పటికప్పుడు లోపాలను పరిష్కరించాలని ఇన్ఫోసిస్‌ను కోరింది. అయితే, ఇప్పటికీ సమస్యలు కొనసాగుతున్నాయి. కాగా, కొత్త పోర్టల్ కోసం ఇన్ఫోసిస్ సంస్థ 2019లో ఒప్పందం చేసుకోగా, దీనికోసం ఆర్థిక శాఖ రూ. 164.5 కోట్లను చెల్లించింది. ఆదాయ పన్ను రిటర్నుల ప్రాసెసింగ్ సమయాన్ని 63 రోజుల నుంచి ఒక్క రోజుకు తగ్గించేందుకు ఈ తయారీ కాంట్రాక్ట్ ఇచ్చారు.

Next Story