ఎప్పుడొచ్చి అడిగినా ఇవ్వాల్సిందే: ఎస్పీ రంజన్

by  |
ఎప్పుడొచ్చి అడిగినా ఇవ్వాల్సిందే: ఎస్పీ రంజన్
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: జోగులాంబ గద్వాల జిల్లాలోని అన్ని ముఖ్య పట్టణాల్లో ఉన్న వ్యాపార సముదాయాలు, పరిశ్రమ సముదాయాలు, పార్థన సముదాయాలు, విద్యా సంస్థలు, హాస్పిటల్స్ , రైల్వేస్టేషన్, బస్ స్టేషన్స్, స్పోర్ట్స్ కంప్లెక్స్, రోజు జనం వచ్చి పోయి ప్రైవేట్ సముదాయాల్లో యజమానులు సీసీ కెమెరాలు తప్పనిసరిగా అమర్చుకోవాలని జిల్లా ఎస్పీ రంజన్ రతన్ కుమార్ తెలిపారు.

జోగుళాoబ గద్వాల్ జిల్లా కర్ణాటక, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాలకు సరిహద్దు జిల్లాగా ఉండి సౌకర్యమైన రోడ్డు మార్గాలు, రైలు మార్గాలు ఉన్నందున నేరస్థులు ఇతర రాష్ట్రాల నుండి వచ్చి నేరం చేసి వెళ్లడానికి అనుకూలంగా ఉన్నదని ఆయన అభిప్రాయపడ్డారు. ఎక్కడైనా నేరం జరిగిన వెంటనే జరిగిన నేరాన్ని గుర్తించుటకు, నేరాన్ని ఛేదించుటకు ఆయా షాప్స్, ఇతర సముదాయాల వద్ద మీరు ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడుతాయని పేర్కొన్నారు.

ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీస్ సిబ్బందితో సమానం అన్నారు. వ్యాపారులు ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలను ప్రతి 30 రోజుల వరకు వీడియో రికార్డ్ ను సేవ్ అయ్యేటట్లు గా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వీడియో డాటాకు సంబంధించి పోలీస్ వారు ఎప్పుడు వచ్చి అడిగినా ఇవ్వవలసి ఉంటుందన్నారు.

ప్రతి 6 నెలలకు ఒకసారి సీసీ కెమెరాకు సంబంధించిన పూర్తి వివరాలు, వాటి నిర్వహణ, వాటి పనితీరు స్థితిని తెలియజేస్తూ సంబంధిత ఇన్స్పెక్టర్ స్థాయి పోలీస్ అధికారికి తెలియజేయాలన్నారు. ఎవరు కూడా దుకాణాలు, వ్యాపార, ఇతర సముదాయాలు మూసివేసిన తరువాత సీసీ కెమెరాలను ఆఫ్ చేయకూడదని, అవి 24 గంటలు ఆన్ లో ఉండేటట్లు చూసుకోవాలని పేర్కొన్నారు. సీసీ కెమెరాలను పెట్టుకోకుంటే మొదటి సారిగా 5,000 జరిమానా, రెండోసారి 10,000 జరిమానా విధిస్తామని హెచ్చరించారు.


Next Story