కరోనా అనంతరం ఆర్థిక పునరుద్ధరణకు ప్రాధాన్యత : ఆర్‌బీఐ గవర్నర్

by  |
rbi governor
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ మహమ్మారి అనంతరం పునరుద్ధరణ కోసం మరింత స్థిరంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ఆర్థిక మద్దతుకు ‘ప్రాధాన్యత’ కల్పిస్తూ కొనసాగించనున్నట్టు గవర్నర్ శక్తికాంతదాస్ అన్నారు. గురువారం ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన పేదరికం, ఆర్థిక అసమానతలను తగ్గించేందుకు ఆర్థిక వృద్ధి కీలకమని ఆర్‌బీఐ గవర్నర్ అభిప్రాయపడ్డారు. అట్టడుగు వర్గాలకు బ్యాంకు సేవలను అందుబాటులోకి తీసుకురావడం, ఆర్థిక ఉత్పత్తులను అందించడం ద్వారా ఆర్థిక వృద్ధి వైపుగా కొనసాగుతున్నామన్నారు.

కొవిడ్ సెకెండ్ వేవ్ పరిస్థితులు తగ్గిపోవడం, టీకా ప్రక్రియ గణనీయంగా కొనసాగుతుండటం వల్ల రానున్న రోజుల్లో భారత ఆర్థికవ్యవస్థ పుంజుకుంటుందని శక్తికాంత దాస్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆర్థికవ్యవస్థలో రికవరీ సాధిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయని, అయితే మార్కెట్లో డిమాండ్ పరిస్థితులు అవసరమైన స్థాయిలో వేగవంతం కాకపోవడంతో ఇది ఆలస్యమవుతోందన్నారు. అదేవిధంగా ఈ ఏడాది ఋతుపవనాలు ఆశించిన స్థాయిలో ఉండటంతో వ్యవసాయ దిగుబడులు భారీ వృద్ధి సాధించి, సరఫరా వ్యవస్థ మెరుగ్గా ఉంటుందని దాస్ వివరించారు. సెకెండ్ వేవ్ ప్రతికూలత వల్ల తయారీ, సేవల రంగంలో పునరుద్ధరణకు ఆటంకాలు ఎదురవుతున్నాయని శక్తికాంత దాస్ వెల్లడించారు.


Next Story