మల్టిపుల్ అకౌంట్లతో లాభమెంత?

by  |
మల్టిపుల్ అకౌంట్లతో లాభమెంత?
X

ముంబయి: గృహ రుణాలు, శాలరీ, మ్యూచువల్ ఫండ్‌, షేర్ మార్కెట్ ట్రేడింగ్ తదితర కారణాలతో పలువురు ఎక్కువ సంఖ్యలో బ్యాంకు ఖాతాలను నిర్వహిస్తుంటారు. ఈ రకమైన మల్టిపుల్ అకౌంట్ల వల్ల ఆర్థిక భారం, నష్టమే తప్పా ఇతర ప్రయోజనాలు ఉండవని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. కొంత మంది ఉద్యోగం మారిన ప్రతిసారి కొత్త ఖాతాను తెరుస్తుంటారు. ఇలా తెరిచిన ప్రతి అకౌంట్‌ను యాక్టివ్‌గా, మినిమమ్ బ్యాలెన్స్‌తో కొనసాగించడంలో విఫలమవుతూ ఉంటారు. మినిమమ్ బ్యాలెన్స్ లేనందుకు చార్జీలను చెల్లిస్తుంటారు. ఇలాంటి ఆర్థిక నష్టాలను కొంత మంది లెక్కించరని, దానివల్ల తెలియకుండానే ఆర్థిక చిక్కుల్లో పడతారని బ్యాంకింగ్ రంగ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఎక్కువ అకౌంట్లు ఉంటే వాటిలో ఎంతో కొంత నగదు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇటీవల మారిన పరిస్థితుల్లో బ్యాంకుల్లో మినిమమ్ బ్యాలెన్స్ రూ.5వేల నుంచి రూ.10వేల వరకు ఉంటున్నాయి. ఈ లెక్కన ఎవరైనా ఒక వ్యక్తి కనీసం ఐదు అకౌంట్లను కలిగి ఉంటే రూ.25వేల వరకు మినిమమ్ బ్యాలెన్స్ రూపంలో అకౌంట్లలో ఉండిపోతాయి. ఐదు అకౌంట్లలో జమ చేయడం కంటే ఆ మొత్తం ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ఉంచితే బ్యాంకుల మినిమమ్ బ్యాలెన్స్‌లపై ఇచ్చే 3శాతం వడ్డీ కంటే అధికంగా అందుతుందని చెబుతున్నారు. పైగా సేవింగ్స్ అకౌంట్లపై డెబిట్ కార్డ్ చార్జీలు అదనంగా చెల్లిస్తూ ఉంటారు. శాలరీ, జీరో బ్యాలెన్స్ అకౌంట్లలో మూడు నెలలపాటు ఎలాంటి లావాదేవీలు జరపకపోతే అవి సాధారణ సేవింగ్స్ అకౌంట్లుగా మారిపోతాయి. అప్పుడు కచ్చితంగా మినిమమ్ బ్యాలెన్స్ నిర్వహించాల్సి వస్తుంది.

యాక్టివ్‌గా లేకపోతే చిక్కే

రెండేండ్లు లేదా అంతకంటే ఎక్కువకాలం అకౌంట్లలో లావాదేవీలను జరపకపోతే వాటిని బ్యాంకులు డీయాక్టివేట్ చేస్తాయి. ఇలాంటి సమయంలో డెబిట్ కార్డు సహా చెక్, ఆన్‌లైన్, మొబైల్ లావాదేవీలన్నీ నిలిచిపోతాయి. ఆ అకౌంట్‌ను మళ్లీ యాక్టివ్ చేయడానికి బ్యాంకు వద్దకు వెళ్లి రాతపూర్వకమైన లెటర్ ఇచ్చి అభ్యర్థించాల్సి ఉంటుంది. ఒకవేళ జాయింట్ అకౌంట్ అయితే అందరు అకౌంట్ హోల్డర్లు యాక్టివేషన్ కోసం సంతకం చేయాల్సి ఉంటుంది. దీనివల్ల అకౌంట్లలో ఉన్న నగదు నుంచి రాబడి రాకపోగా ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్‌ల సమయంలో అన్ని ఖాతాల వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆన్‌లైన్ లావాదేవీలను నిర్వహించేందుకు అన్ని ఖాతాల పాస్‌వర్డ్‌లను గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది.

చార్జీల మోత

తక్కువ సంఖ్యలో బ్యాంకు అకౌంట్లు ఉండటం మెరుగైన ఆర్థిక క్రమశిక్షణ అవుతుందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. శాలరీ అకౌంట్, కుటుంబ సభ్యులతో కూడిన జాయింట్ అకౌంట్ ఉంటే చాలు. నగదు అత్యవసరమైనప్పుడు కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఒకరు అందుబాటులో లేకపోతే మరొకరు తెచ్చుకునే వెసులుబాటు ఉంటుంది. ఒక్కోసారి తప్పనిసరి పరిస్థితుల్లో కొన్నిసార్లు రెండు కంటే ఎక్కువ అకౌంట్లను తెరవాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో మరో వ్యక్తిగత ఖాతాను ప్రారంభించవచ్చు. ఉద్యోగ నిమిత్తం కంపెనీని అనుసరించి శాలరీ అకౌంట్లు మారుతుంటాయి. భవిష్యత్తు పెట్టుబడుల కోసం వ్యక్తిగత అకౌంట్‌ను వినియోగించవచ్చు. అంతేగాని ఏదైనా బ్యాంకులో తక్కువ వడ్డీతో రుణాలిస్తారని, వార్షిక వడ్డీ ఎక్కువగా ఉందని వేర్వేరు బ్యాంకుల్లో వేర్వేరు ఖాతాలను కొనసాగిస్తే అనవసర చార్జీలను చెల్లించక తప్పదు.

ఎక్కువ అకౌంట్లతో గందరగోళం

ఉద్యోగంలో జాయిన్ అయ్యాక ఈపీఎఫ్ అకౌంట్‌కు ఒక యూనివర్సల్ అకౌంట్ నంబర్ ఇస్తారు. ఉద్యోగం మారితే అదే అకౌంట్ నంబర్‌తో మరో కంపెనీకి మార్చుకోవచ్చు. అలాగే, మ్యూచువల్ ఫండ్, పీపీఎఫ్ తదితర పెట్టుబడుల కోసం ఒక ఖాతానే ఉపయోగించడం మంచిది. ఒక్కో దానికి ఒక్కో అకౌంట్ నిర్వహిస్తే గందరగోళానికి గురవుతారు. ఆర్థిక భారం కూడా పడుతుంది. వ్యక్తిగత అకౌంట్‌ను శాలరీ అకౌంట్‌కు అనుసంధానం చేసుకుంటే, ఉద్యోగం మారిన సమయంలో ఆన్‌లైన్ ద్వారా శాలరీ అకౌంట్‌లో సొమ్మును ఇందులోకి బదిలీ చేసి పాత అకౌంట్‌ను క్లోజ్ చేసుకోవచ్చు.

Next Story

Most Viewed