సీఎంకు షాక్ ఇవ్వనున్న ఫీల్డ్ అసిస్టెంట్లు.. హుజురాబాద్‌లో పాదయాత్ర

by  |
సీఎంకు షాక్ ఇవ్వనున్న ఫీల్డ్ అసిస్టెంట్లు.. హుజురాబాద్‌లో పాదయాత్ర
X

దిశ ప్రతినిది, కరీంనగర్: ఉపాది హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. హుజురాబాద్‌లో అధికార టీఆర్ఎస్ పార్టీకి తమ సత్తా ఏంటో చాటాలన్న తలంపుతో ఉన్న వీరు భారీ స్కెచ్ తోనే ముందుకు సాగుతున్నారు. రాష్ట్రంలోని 7500 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు తమ మకాం అంతా హుజురాబాద్‌కే మార్చాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే పలు మార్లు మీటింగ్‌లు ఏర్పాటు చేసుకున్న ఫీల్డ్ అసిస్టెంట్లు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉప ఎన్నికల్లో వెయ్యి మంది పోటీ చేయాలన్న తలంపుతో ఉన్న వీరంతా కూడా ఈ నెల 19 తరువాత నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు.

బీసీ సంఘం వ్యవస్థాపక నేత ఆర్ కృష్ణయ్య చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించి ఐదు మండలాల్లో పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. ఈ పాదయాత్రలో టీఆర్ఎస్ మినహా ఇతర రాజకీయ పార్టీలు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు, బీసీ సంఘాల భాగస్వామ్యం ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. పాదయాత్ర చివరి రోజున హుజురాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సభకు ఫీల్డ్ అసిస్టెంట్ల కుటుంబాలకు చెందిన 10 మంది చొప్పున హాజరు అయ్యేలా చొరవ చూపాలని కూడా నిర్ణయించారు. ఈ మేరకు ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శామలయ్య కూడా ‘దిశ’తో మాట్లాడుతూ… ఉద్యోగాలు తొలగించడంతో తమ కుటుంబాలన్ని కూడా వీధిన పడ్డాయన్నారు. ఉన్నట్టుండి విధుల నుంచి తొలగిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఆర్థిక ఇబ్బందుల్లో కూరకపోయామన్నారు. కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితుల్లో తమను ఆదుకోవాలని ఎన్నో సార్లు వినతి చేసినా పట్టించుకోలేదన్నారు. ఈ ఎన్నికల్లో ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలన్న సంకల్పంతోనే ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. హామీలు ఇచ్చి చేతులు దులుపుకుంటే ఊరుకునేది లేదని, తమను తిరిగి విధుల్లో చేర్చుకుంటున్నట్టు ఉత్తర్వులు జారీ చేస్తేనే తమ ఉద్యమంలో మార్పులు చేర్పులు ఉంటాయని శ్యామలయ్య తెలిపారు.

Next Story

Most Viewed