50+ పౌరులకు వ్యాక్సిన్ ఎట్లా?

by  |
50+ పౌరులకు వ్యాక్సిన్ ఎట్లా?
X

దిశ, తెలంగాణ బ్యూరో : యాభై ఏళ్ల వయసు దాటినవారందరికీ కరోనా వ్యాక్సిన్‌ను ఉచితంగా ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టమైన నిర్ణయం తీసుకున్నాయి. తొలి ప్రాధాన్యతగా హెల్త్ కేర్ సిబ్బంది, ఆ తర్వాత రెవెన్యూ, పోలీసు, పారిశుధ్య సిబ్బందికి వ్యాక్సిన్ లభించనుంది. 50 ఏళ్లు పైబడినవారికి, 50 ఏళ్లలోపు దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నవారికీ వ్యాక్సిన్‌ను ఉచితంగానే ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు ఇప్పటికే స్పష్టం చేశారు.

అయితే అలాంటి వారి పేర్లను ‘కొవిన్’ సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేసుకోవడానికి ఓటర్ల జాబితా మాత్రమే ఏకైక ప్రామాణికం అని ఆయన స్పష్టం చేశారు. కానీ ఓటర్ల జాబితాలో పేరు లేకుంటే ఏం చేయాలనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనిపై అన్ని పార్టీలూ సందర్భానుసారం విమర్శలు చేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో వారిని గుర్తించి వ్యాక్సిన్‌ను అందించడం ప్రభుత్వ బాధ్యతగా ముందుకొచ్చింది. ప్రజలే స్వచ్ఛందంగా వారి పేర్లను నమోదు చేసుకోడానికి త్వరలో మొబైల్ యాప్ లేదా వెబ్‌సైట్ లింకు వినియోగంలోకి వస్తుందని వైద్యారోగ్య శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

అర్హులైనవారందరికీ అందడంపై గందరగోళం
‘ఆశా’ వర్కర్లు, ఏఎన్ఎంలు ఆయా గ్రామాల్లో ఉన్న 50 ఏళ్ల పైబడినవారిని గుర్తించి ‘కొవిన్’ సాఫ్ట్‌వేర్‌లో పేర్లను నమోదు చేస్తారని వైద్యారోగ్య శాఖ అధికారులు పేర్కొంటున్నారు. కానీ దానికి ప్రామాణికం ఓటర్ల జాబితా కావడంతో పేర్ల నమోదులో అర్హులైనవారందరికీ వ్యాక్సిన్ అందడంపై గందరగోళం నెలకొంది. ప్రజలే స్వచ్ఛందంగా వారి పేర్లను ‘కొవిన్’లో నమోదు చేసుకోడానికి అవకాశం లేకపోవడంతో స్థానికంగా ఉన్న మండల వైద్యాధికారి లేదా ప్రభుత్వ ఆసుపత్రి వర్గాల ద్వారా పేర్లను నమోదు చేయించుకునే అవకాశంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత లేదు. హెల్త్ కేర్ సిబ్బంది వివరాలన్నీ ఇప్పటికే నమోదైనా పోలీసు, రెవెన్యూ, పారిశుద్య సిబ్బంది పేర్ల నమోదు ప్రక్రియ మాత్రం ఇంకా కొలిక్కి రాలేదు.

వెబ్‌సైట్ లింకు వచ్చేదెప్పుడు?
వ్యాక్సిన్ కోసం పేర్ల నమోదుకు కేంద్ర ప్రభుత్వం మొబైల్ యాప్‌ను, వెబ్‌సైట్‌ను ఎప్పుడు అందుబాటులోకి తెస్తాయని పలువురు ఎదురుచూస్తున్నారు. జనవరి 16 నుంచి వ్యాక్సిన్ అందుబాటులోకి రావచ్చన్న సంకేతాలు కేంద్ర ప్రభుత్వం నుంచి రావడంతో నాలుగైదు రోజుల్లోనే పేర్లను నమోదు చేసుకోవడంపై తలెత్తే సందేహాలకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి ఇంకా స్పష్టత రాలేదు. రాష్ట్రంలో 50 ఏళ్ల పైబడినవారు ఎంత మంది ఉన్నారనేదానిపై కూడా అధికారికంగా ఇప్పటివరకు ప్రభుత్వం వివరాలను వెల్లడించలేదు. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 18 రకాల గుర్తింపు కార్డులను వ్యాక్సిన్ కోసం సూచించినందున వాటి ఆధారంగా ‘మీ సేవ’ కేంద్రాల్లో ప్రజలే స్వచ్ఛందంగా వారి పేర్లను నమోదు చేసుకోడానికి కూడా ఇంకా ఎలాంటి వ్యవస్థ ఉనికిలోకి రాలేదు. ఈ నేపథ్యంలో దీనిపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాల్సి ఉంది.


Next Story

Most Viewed