పంపిణీ తగ్గినా..విక్రయాలు మెరుగ్గానే!

by  |
పంపిణీ తగ్గినా..విక్రయాలు మెరుగ్గానే!
X

దిశ, వెబ్‌డెస్క్: గత నెల పండుగ సీజన్ ముగియడంతో భారత అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ నవంబర్‌లో డీలర్‌షిప్‌లకు పంపిణీ చేసే ప్యాసింజర్ వాహనాలు 2.4 శాతం క్షీణించాయి. దీంతో గతేడాది ఇదే నెలలో 1,39,133 యూనిట్ల నుంచి 1,35,775 యూనిట్లకు తగ్గాయి. అయితే, గతేడాదితో పోలిస్తే ఈసారి నవంబర్ నెల మొత్తం విక్రయాలు 1.7 శాతం పెరిగి 1,53,223 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే నెలలో 1,50,630 యూనిట్లను కంపెనీ విక్రయించింది. దేశీయ విక్రయాలు 1,38,956 యూనిట్లుగా నమోదయ్యాయి. అదేవిధంగా, ఎగుమతులు 29.7 శాతం పెరిగి 9,004 యూనిట్లకు చేరుకున్నాయి.

‘ప్రస్తుతం అమ్మకాలు మెరుగ్గా ఉన్నాయి. డిసెంబర్ అమ్మకాలు కూడా ఇదే స్థాయిలో ఉంటాయనే నమ్మకం ఉంది. తయారీదారులు అందిస్తున్న ఆఫర్లు, డిస్కౌంట్ల ద్వారా అమ్మకాలు పెరుగుతాయి. కాబట్టి డిసెంబర్ నెలకు సంబంధించి అమ్మకాలపై భరోసా ఉంది. అయితే, వచ్చే ఏడాది జనవరి నుంచి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం కష్టం. అమ్మకాల్లో తిరోగమనం ఉండొచ్చు లేదా ఇదే స్థాయిలో ఊపందుకోవచ్చు’ అని మారుతీ సుజుకి ఇండియా ఛైర్మన్ ఆర్ సీ భార్గవ చెప్పారు.

మొత్తం కార్ల అమ్మకాల పరంగా మెరుగ్గా ఉన్నప్పటికీ, చిన్న కార్ల విభాగంలో భారీ పతనాన్ని చూసినట్టు కంపెనీ తెలిపింది. ఆల్టో, ఎస్-ప్రెస్సో హ్యాచ్‌బ్యాక్‌లను విక్రయించే ఎంట్రీ లెవల్ మినీ విభాగం అమ్మకాలు 15 శాతం క్షీణించి 22,339 యూనిట్లకు చేరుకున్నాయి. కాంపాక్ట్ స్మాల్ కార్ల విభాగంలో అమ్మకాలు 1.8 శాతం 76,630 యూనిట్లుగా నమోదయ్యాయి. అలాగే, యుటిలిటీ వాహన అమ్మకాలు 23,753 యూనిట్లతో 2.4 శాతం వృద్ధిని నమోదు చేయగా, వ్యాన్ విక్రయాలు 11,183 యూనిట్లతో 10 శాతం వృద్ధిని సాధించాయి.


Next Story

Most Viewed