డీఎస్పీ ఆఫీస్ ఎదుట మహిళా రైతు ఆత్మహత్యాయత్నం

by  |
Women-farmer-Kavitha
X

దిశ, నల్లగొండ: నల్లగొండ డీఎస్పీ ఆఫీస్ ఆవరణలో పురుగులమందుతాగి ఓ మహిళా రైతు ఆత్మహత్యాయత్నం చేసింది. బాధితురాలి బంధువుల వివరాల ప్రకారం.. నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని కతాల్‌గూడకు చెందిన మహిళా రైతు దండంపల్లి కవితకు తమ పక్క పొలంలో ఉన్నటువంటి ఆమె బంధువులతో భూమి విషయంలో కొంతకాలంగా వివాదం జరుగుతోంది. ఈ క్రమంలో కవిత బంధువులు వారి భూములను విక్రయించారు. అనంతరం వారు కవిత భూమిపైకి వచ్చి భూమి మాది అంటూ తరచూ ఆమెతో ఘర్షణ పడుతున్నారు. దీంతో చేసేదేంలేక ఆమె నలగొండ ఆర్డీఓ, ఎమ్మార్వోలకు ఫిర్యాదు చేసింది. వారి ఆదేశాల మేరకు అధికారులు భూములను సర్వే చేయించారు.

ఆ తర్వాత పోలీసులు జోక్యం చేసుకొని తమను వేధిస్తున్నారని బాధితులు కవిత నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్‌ రెడ్డిని ఆశ్రయించింది. దీనికి స్పందించిన డీఎస్పీ విచారణ జరిపి, న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. డీఎస్పీ కలిసే ముందు కార్యాలయం ఎదుట పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన పోలీసులు ఆమెను అడ్డుకొని డీఎస్పీ కలిపించి, ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు ఇంకా ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం.

Next Story

Most Viewed