డ్రంక్ అండ్ డ్రైవ్‌కు భయపడి భార్యను వదిలి భర్త పరారు

by  |
డ్రంక్ అండ్ డ్రైవ్‌కు భయపడి భార్యను వదిలి భర్త పరారు
X

దిశ రాజేంద్రనగర్ : భార్యను బైక్ పై ఎక్కించుకుని వస్తున్న భర్త సడన్‌గా బండి ఆపి అక్కడి నుండి పరారైన ఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తొండుపల్లిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే… శంషాబాద్ వైపు నుండి షాద్‌నగర్ వైపు బైక్ పై రాజు అనే వ్యక్తి తన భార్యతో కలిసి వెళుతున్నాడు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని తొండుపల్లీ వద్దకు రాగానే అక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులను అతను చూశాడు. వెంటనే తన భార్యను, బండిని రోడ్డుపైనే వదిలేసి అక్కడ నుండి నెమ్మదిగా రాజు జారుకున్నాడు.

కాగా భర్త ఎక్కడికి వెళ్ళాడో తెలియక భార్య ఆందోళన చెందింది. ఎంతసేపటికి భర్త రాకపోవడంతో రోడ్డుపక్కనే దిక్కుతోచని స్థితిలో ఏడుస్తూ ఉండిపోయింది. అది గమనించిన ఎయిర్ పోర్టు పోలీసులు బండితో పాటు మహిళను ఎయిర్ పోర్టు పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి ఆమె భర్త వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె భర్తను పిలిపించి అతనికి ఆమెను అప్పగించారు. ఎందుకు నీ భార్యను వదిలి పెట్టి వెళ్ళి పోయావని రాజును ఎయిర్ పోర్టు పోలీసులు విచారించారు. కాగా మద్యం తాగి ఉన్నానని… తనిఖీల్లో దొరికితే జైలుకు పంపుతారనే భయంతో ఆమెను వదిలి పెట్టి పోయానని పోలీసులకు తెలపడంతో వాళ్లు అవాక్కయ్యారు.


Next Story

Most Viewed