ఏజెన్సీలో క్యాన్సర్ భయం

by  |
ఏజెన్సీలో క్యాన్సర్ భయం
X

దిశ, కుక్కునూరు: ఏజెన్సీలో కొంతకాలం నుంచి క్యాన్సర్ ప్రబలుతుంది. క్రమంగా రోగుల సంఖ్య పెరుగుతుంది. కొన్నేళ్ల నుంచి మరణాలు కూడా సంభవిస్తున్నాయి. చాపకింద నీరులా కుక్కునూరు మండలంలో వ్యాప్తి చెందుతుంది. పలు రకాల క్యాన్సర్లతో రోగులు బాధపడుతున్నారు. బ్రెయిన్, బోన్, చెస్ట్, లివర్, గొంతు వంటి భయంకరమైన క్యానర్లు ఏజెన్సీని తాకాయి. కొందరు మృత్యువుతో పోరాడుతున్నట్టు సమాచారం. పేద కుటుంబాలలో క్యాన్సర్ చిచ్చు రేపడంతో బాగా ఆర్ధికంగా నలిగిపోతున్నారు.

ఒక్కొక్క క్యాన్సర్ రోగి చికిత్స కోసం అప్పో.. సప్పో చేసి సుమారు రూ.10 నుంచి రూ.20 లక్షల వరకు ఖర్చు చేస్తున్నామని బాధితులు వాపోతున్నారు. అయినప్పటికీ ప్రాణాలను దక్కించుకోలేకపోతున్నామని రోగుల కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. కొందరు ప్రభుత్వ పథకాల ద్వారా కూడా చికిత్స పొందుతున్నారు. కాగా రోగులు విజయవాడ, రాజమండ్రి, హైదరాబాద్ వంటి పెద్ద పెద్ద పట్టణాల్లోని ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. సుమారు రెండేళ్ల క్రితం బెస్తగూడెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గొంతు క్యాన్సర్ తో మృతి చెందగా.. కొన్ని నెలల క్రితం ఆ గ్రామంలోనే మరో వ్యక్తి గొంతు క్యాన్సర్ బారినపడి మృతి చెందాడు.

కాగా ప్రస్తుతం ఆ గ్రామంలోనే మరో ముగ్గురు క్యాన్సర్ తో బాధపడుతున్నారు. అదే గ్రామానికి చెందిన మరొకరు గొంతు క్యాన్సర్ బారినపడి ఎట్టకేలకు మృత్యువును జయించాడు. క్యాన్సర్ బారినపడిన రోగులు శస్త్రచికిత్సలు చేయించుకుని ప్రస్తుతం ట్రీట్మెంట్ పొందుతున్నారు. ప్రభుత్వం దృష్టి పెట్టి క్యాన్సర్ రోగులకు కూడా పోషణ నిమిత్తం ఆర్ధిక సహాయం చేసేలా చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.



Next Story