ఆదిలాబాద్‌లో భయం.. భయం..

by  |
ఆదిలాబాద్‌లో భయం.. భయం..
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజల్లో భయం మొదలైంది. అటవీ పరిసర గ్రామాలు, జనావాసాల్లోకి పెద్దపులులు, చిరుతపులులు సంచరించటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ఇద్దరిని చంపగా.. ప్రతి రోజూ ఏదో ఓ ప్రాంతంలో మనుషులు, పశువులపై దాడికి పాల్పడుతున్నాయి. 5 నెలల క్రితం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలం దిగడలో ఓ గిరిజన యువకుడు, పెంచికల్పేట్ మండలం కొండపల్లిలో మరో గిరిజన బాలికపై పెద్దపులి దాడి చేసి చంపేసింది. ఈ ఘటనలు మరువక ముందే.. ఇతర ప్రాంతాలు, గ్రామాల్లోనూ పెద్దపులులు, చిరుత పులుల సంచరిస్తూ మనుషులు, పశువులపై దాడులు చేస్తున్నాయి.

ప్రతి రోజూ ఏదో ఒక చోట చిరుతలు, పెద్దపులులు సంచరిస్తూ ప్రజలను భయందోళనకు గురిచేస్తున్నాయి. దీంతో అటవీ పరిసర గ్రామాలు, గిరిజన తండాలు, ఆదివాసీ గూడెం కు చెందిన వారితో పాటు ఉమ్మడి జిల్లాలోని చాలా చోట్ల జనం చేలకు, పొలలకు, అడవికి వెళ్లాలంటే జంకుతున్నారు. ఇటీవల తానూరు, కుభీర్ మండలాల్లో పెద్దపులి, చిరుతపులులు మనుషులు, పశువులపై దాడి చేసిన ఘటనలు వెలుగుచూశాయి. పెద్దపులులు, చిరుతలు సంచరిస్తున్నట్టు ఫారెస్ట్ ఆఫీసర్లు సైతం ధ్రువీకరించటం కలకలం రేకెత్తిస్తోంది.

రెండు పులుల సంచారం

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ అభయారణ్యంలో 7 పెద్దపులులున్నాయి. వాటిలో ఒక ఆడ, రెండు మగ పులులతో పాటు 4 (2 ఆడ, 2 మగ) పులి పిల్లలు ఉన్నాయి. ఇక మహారాష్ట్రలోని తడోబా, తిప్పేశ్వర్ అభయారణ్యాల నుంచి కవ్వాల్‌కు పెద్దపులులు వస్తుంటాయి. మరోవైపు ఛత్తీస్‌గడ్‌లోని ఇంద్రావతి అభయారణ్యం నుంచి ఏటూరు నాగారం మీదుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు, పాకాల, తాడ్వాయి, భూపాలపల్లి, కొత్తగూడ, గూడూరు, మహదేవ్‌పూర్ ప్రాంతాల్లో 2 పెద్దపులులు సంచరిస్తున్న ఆనవాళ్లు లభించాయి. ఆదిలాబాద్ జిల్లా తాంసి, తలమడుగు ప్రాంతం నుంచి ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు, దహేగాం మీదుగా మంచిర్యాల కోటపల్లి, నీల్వాయి, చెన్నూరు వరకు పెద్ద పులుల సంచరిస్తున్నాయి. తాజాగా ముధోల్ నియోజకవర్గంలోని అటవీ పరిసర గ్రామాల్లో పెద్దపులులు, చిరుతలు సంచరిస్తుండటంతో కలవరం మొదలైంది. కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో రెండు పెద్దపులులు సంచరిస్తున్నట్టు అటవీ శాఖ అధికారులు గుర్తించారు.

ఆపరేషన్ మ్యాన్ ఈటర్

మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో పులుల సంచారం, కదలికలపై అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నారు. సిబ్బందికి ఇప్పటికే రామగుండం, ములుగులో శిక్షణ ఇచ్చారు. పెద్దపులి ఫొటో దొరికితే.. రంగును బట్టి అది ఎక్కడి నుంచి వచ్చింది? దాని తల్లి ఎవరు? వంటి సమగ్ర సమాచారం తెలుసుకునే వీలుంది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆపరేషన్ మ్యాన్ ఈటర్ కొనసాగుతున్నా.. పులుల జాడ తెలియటం లేదు. పాదముద్రలను సేకరిస్తూ.. బంధించేందుకు రెస్య్కూ, ఫ్లైయింగ్ స్క్వాడ్లు రంగంలోకి దిగాయి. బెజ్జూరు, దహేగాం, పెంచికల్పేట్ మండలాల్లోని 52గ్రామాల్లో ప్రత్యేక నిఘా పెట్టారు. పులికి ఎరగా ఆవులను ఉంచుతున్నారు. 340 సీసీ కెమెరాలు, 60 మంది టైగర్ ట్రాకర్లతో పులి కదలికలపై నిఘా పెట్టారు. ఇటీవల గుండ్లపల్లిలోని ఏ2 టైగర్ కెమెరాలకు చిక్కింది.

బెజ్జూరు మండలం కంది భీమన్న అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు ఎరవేసిన ఆవును పులి చంపేసింది. అది తిరిగి అక్కడికే వస్తుందనే భావించి రెస్య్కూ టీంలతో పాటు మత్తు మందు నిపుణులు, షూటర్లను రంగంలోకి దింపారు. మహారాష్ట్ర, తెలంగాణ ర్యాపిడ్ యాక్షన్ టీంలు.. మహారాష్ట్రకు చెందిన నిపుణులతో ఆపరేషన్ మ్యాన్ ఈటర్ కొనసాగుతోంది. కోర్ ఏరియాలోని గ్రామాలను తరలించేందుకు చర్యలు చేపట్టగా.. ముందుగా కడెం మండలం రాంపూర్, మైసంపేట, రెండో విడతలో అల్లీనగర్, గండిగోపాల్పూర్, ఇస్లాంపూర్, దొంగపల్లి, మిద్దెచింత గ్రామాలను ఖాళీ చేయించాలి. ఆదివాసీలను అడవుల నుంచి బయటకు పంపేందుకే సర్కారు కుట్ర చేస్తోందని.. అందుకే పెద్దపులిని పట్టుకోవటం లేదని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావుతో పాటు ఆదివాసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి.


Next Story

Most Viewed