ఆ రంగంలో నాలుగు రెట్లు పెరిగిన ఎఫ్‌డీఐలు..

by  |
ఆ రంగంలో నాలుగు రెట్లు పెరిగిన ఎఫ్‌డీఐలు..
X

దిశ, వెబ్‌డెస్క్: సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) 2020-21 ఏప్రిల్-డిసెంబర్ మధ్యకాలంలో నాలుగు రెట్లు పెరిగాయని డీపీఐఐటీ తెలిపింది. ఏడాది క్రితం ఈ రంగంలో సుమారు రూ. 46.7 వేల కోట్ల ఎఫ్‌డీఐలు లభించగా, మొత్తం 2019-20 ఆర్థిక సంవత్సరానికి సుమారు రూ. 56.2 వేల కోట్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయని డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్(డీపీఐఐఅటీ) గణాంకాలు పేర్కొన్నాయి.

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కరోనా కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్‌తో డిజిటలైజేషన్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) వేగవంతమయ్యాయి. దీంతో కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ రంగంలో పెట్టుబడులు పెరిగాయి. అంతర్జాతీయంగా ఎలక్ట్రానిక్స్, డిజిటల్ మార్పుతో దేశీయంగా ఈ రంగంలో ఎఫ్‌డీఐల పెరుగుదల నమోదు అయింది. భారత టెక్ సంస్థలు అదే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని నిపుణులు వివరించారు.

ఇక, 2020-21 ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో విదేశీ పెట్టుబడులను సాధించిన ఇతర రంగాల్లో నిర్మాణ(మౌలిక సదుపాయాలు) కార్యకలాపాలు సుమారు రూ. 52.5 వేల కోట్లు, ఔషధ రంగంలో రూ. 9 వేల కోట్లను సాధించాయి. టెలీకమ్యూనికేషన్ రంగంలో విదేశీ పెట్టుబడులు సుమారు రూ. 31.3 వేల కోట్ల నుంచి సుమారు రూ. 2,606 కోట్లకు పడిపోయింది.

ఆటోమొబైల్స్ రంగం కూడా సుమారు రూ. 18.2 వేల కోట్ల నుంచి సుమారు రూ. 8,614 కోట్లకు తగ్గింది. అలాగే, సింగపూర్ నుంచి అధికంగా సుమారు రూ. 1.14 లక్ష కోట్ల ఎఫ్‌డీఐలను భారత్ ఆకర్షించింది. తర్వాతి స్థానంలో రూ. 93.5 వేల కోట్లతో అమెరికా ఉంది. దేశంలో మొత్తం ఎఫ్‌డీఐ ఈక్విటీ ప్రవాహం 40 శాతం పెరిగి సుమారు రూ. 3.75 లక్షల కోట్లకు చేరుకుంది.

Next Story