కస్టం మిల్లింగ్‌తో మిల్లర్ల దందా.. FCI వార్నింగ్ బేఖాతరు

by  |
కస్టం మిల్లింగ్‌తో మిల్లర్ల దందా.. FCI వార్నింగ్ బేఖాతరు
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ ధాన్యంతో మిల్లర్లు మహా వ్యాపారం సాగిస్తున్నారు. మిల్లర్ల మాయలో పడిన పౌరసరఫరాల శాఖ చేతులెత్తేసి చూస్తోంది. కస్టం మిల్లింగ్‌కు ఇచ్చిన ధాన్యానికి ఇంకా లెక్కలు తేల్చడం లేదు. మొత్తం లక్షా 2 వేల క్వింటాళ్ల బియ్యాన్ని వ్యాపారంగా మార్చుకున్నారు. దీన్ని తప్పించేందుకు మిల్లర్లు కూడా అధికారులను మాయలో పడేస్తున్నారు. మరోవైపు ఎఫ్‌సీఐ మాత్రం ఈ ధాన్యం వివరాలు తేల్చాలంటూ ఇప్పటికే నాలుగుసార్లు లేఖ రాసింది. తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. కానీ, అధికారులు మాత్రం మిల్లర్లకే మద్దతుగా ఉంటున్నారు. ఎఫ్‌సీఐ అధికారులు ఈ లేఖలను చెత్తబుట్టల్లో పడేస్తున్నారు. తాజాగా రాష్ట్రంలో 60 మిల్లులను బ్లాక్ లిస్టులో పెట్టిన అధికారులు.. ఇప్పుడు మళ్లీ ధాన్యం సేకరణ మొదలుకానున్న నేపథ్యంలో వాటికి ధాన్యం ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు.

మీరంటే ప్రేమ..!

రాష్ట్రంలోని మిల్లర్లపై పౌర‌ స‌ర‌ఫరాల‌ శాఖ వ‌ల్లమాలిన ప్రేమ ఒల‌క‌బోస్తున్నట్లే కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా యాసంగి సీజ‌న్‌లో ప్రభుత్వం 64 ల‌క్షల మెట్రిక్ ట‌న్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. దీన్ని సీఎంఆర్ కోసం మిల్లర్లకు కేటాయించింది. ప్రస్తుతం వానాకాలం సీజన్ ధాన్యం కొనుగోళ్లు మొదలువుతున్నాయి. కానీ, గత యాసంగి సీజన్​ ధాన్యం తాలుకా క‌స్టమ్ రైస్ మిల్లింగ్ పూర్తి చేయ‌లేదు. దీనిపై పౌర స‌ర‌ఫ‌రాల శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం తేటతెల్లమవుతోంది. అధికారులు, మంత్రి కలిసి మిల్లర్లతో నిత్యం సమావేశమవుతున్నామంటూ చెప్పుతున్నా గత సీజన్​ సీఎంఆర్‌పై మాత్రం నోరెత్తడం లేదు. దీంతో మిల్లర్లు కూడా మాకేం భయం లేదన్నట్టుగా ఉంటున్నారు.

రాష్ట్రంలో మొత్తం 2,400 మిల్లులుండగా.. అందులో బాయిల్డ్ మిల్లులు సుమారు 940 వ‌ర‌కు ఉన్నాయి. వాస్తవంగా కస్టం మిల్లింగ్‌ విషయంలో మిల్లర్లపై చాలా ఆరోపణలున్నాయి. కెపాసిటీ ప్రకారం మిల్లులను నడపడంలేదని, నడిపినా ప్రభుత్వానికి తక్కువగా ఇవ్వడం.. ప్రైవేట్ వ్యాపారానికి ఎక్కువగా ఇవ్వడం చేస్తున్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. అయితే, ఇటీవల సివిల్ సప్లై మంత్రి కేవలం రాజకీయాలకే పరిమితం కావడం, ఎప్పుడైనా సమీక్షలు చేసినా కేవలం కరీంనగర్‌కు మాత్రమే పరిమితం కావడంతో రాష్ట్రంలో మిల్లర్ల ఇష్టారాజ్యం నడుస్తోంది.

లక్ష టన్నుల బియ్యం ఏమయ్యాయి..?

ప్రభుత్వం గ‌‌త సీజ‌న్‌లో 64 లక్షల మెట్రిక్ ట‌న్నుల ధాన్యాన్ని మిల్లర్లకు సీఎంఆర్‌కు అప్పగించింది. ప్రభుత్వ గ‌ణాంకాల ప్రకారం 64 ల‌క్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి 43 ల‌క్షల మెట్రిక్ ట‌న్నుల బియ్యాన్ని తిరిగి అప్పగించాల్సి ఉంటోంది. కానీ, ఇచ్చిన ధాన్యంలో ఇంకా ల‌క్షా 2వేల ట‌న్నుల బియ్యం మిల్లర్ల నుంచి సివిల్ సప్లైకి రావాల్సి ఉంది. ప్రస్తుతం వానాకాలం ధాన్యం కొనుగోళ్లు మొదలైన నేపథ్యంలో పాత బియ్యంపై ఎఫ్‌సీఐ మెలిక పెట్టుతోంది.

సీఎంఆర్ తేల్చాలని స్పష్టం చేస్తూ లేఖ పంపించింది. ధాన్యం తీసుకున్న మిల్లుల నుంచి బియ్యం రాలేదంటూ సూచించింది. కానీ, సివిల్​ సప్లై దీనిపై పెద్దగా రెస్పాన్స్ ఇవ్వలేదు. ప్రస్తుత సమయంలో మళ్లీ కొత్తగా సీఎంఆర్‌కు ధాన్యం తరలిస్తున్నారు. ఎఫ్‌సీఐ లేఖలతో దాదాపు 60 మిల్లులకు నోటీసులు జారీ చేశారు. కానీ, అధికారుల అండదండలు, గతంలోనూ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో మిల్లర్లు తేలిగ్గానే తీసుకుంటున్నారు. పాత ధాన్యం లెక్కలు మాత్రం తేల్చడం లేదు.

ప్రభుత్వ ధాన్యంతో వ్యాపారం..

ప్రతీ సీజన్‌లో రైస్​మిల్లర్లు కస్టం మిల్లింగ్‌తో వ్యాపారం సాగిస్తున్నారని స్పష్టమవుతోంది. ఏటా ఎంతో కొంత బియ్యాన్ని ఇవ్వకుండా దాట వేస్తున్నారు. ఒక సీజన్‌లో తక్కువగా ఇవ్వడం, దాన్ని సాగదీస్తున్న నేపథ్యంలోనే కొత్త సీజన్​ రావడం.. ఆ ధాన్యం మళ్లీ సీఎంఆర్‌కు ఇవ్వడం.. పాత లెక్కలు పక్కనేయడం ప్రతీ సారి జరుగుతూనే ఉన్నట్లు గుర్తించారు. అయితే కొంతమంది మిల్లర్లలోనే ఉన్న గ్రూపులతో ఇవి ఫిర్యాదుల వరకూ వెళ్తున్నా.. సివిల్ సప్లై కార్పొరేషన్‌లో మాత్రం కొంతమంది అధికారులు మధ్యవర్తిత్వం చేసి వారిని సముదాయిస్తున్నారు.

దీంతో, అటు వ్యాపారులకు, ఇటు అధికారులకు ధాన్యం లెక్కల్లో కలిసి వస్తోంది. వాస్తవానికి సీఎంఆర్ కోసం మిల్లర్లకు అప్పగించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి నిర్దేశించిన గ‌డువులోగా మిల్లర్లు తిరిగి అప్పగించాల్సి ఉంటోంది. కానీ ప్రతీ ఏటా సీజన్​ చివరి వరకూ సాగదీస్తూనే ఉంటున్నారు. సీఎంఆర్ ధాన్యంతో మిల్లర్లు వ్యాపారం చేస్తున్నారని తెలిసింది.

ఇస్తారా.. ఇవ్వరా.. మూడుసార్లు గడువిచ్చిన ఎఫ్‌సీఐ

సీఎంఆర్ నుంచి వ‌చ్చిన బియ్యాన్ని ప్రజాప్రయోజ‌నాల కోసం వినియోగించాల్సి వస్తుండటంతో ఇవన్నీ భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) ఆధీనంలో ఉంటున్నాయి. గత సీజన్‌లో మొత్తం 64 ల‌క్షల మెట్రిక్ ట‌న్నుల ధాన్యానికి 43 ల‌క్షల మెట్రిక్ ట‌న్నుల బియ్యం ఇవ్వాల్సి ఉండ‌గా ఇప్పటికీ 42 ల‌క్షల మెట్రిక్ టన్నులు మాత్రమే మిల్లర్లు తిరిగిచ్చారు. ఇంకా అధికారిక లెక్కల ప్రకారం లక్షా 2 వేల మెట్రిక్ టన్నుల బియ్యం కోసం ఎఫ్‌సీఐ కొంతకాలంగా లేఖలు రాస్తూనే ఉంది. నాలుగుసార్లు గడువు పెట్టింది.

గత సీజన్ బియ్యాన్ని ఈ ఏడాది జూన్​నెలాఖరు వరకు గడువు ఇచ్చి మిగిలిన బియ్యాన్ని ఇవ్వాలంటూ గతంలోనే తేల్చి చెప్పింది. కానీ, ఈ నోటీసులను మిల్లర్లు నిర్లక్ష్యంగా తీసుకున్నారు. దీన్ని పర్యవేక్షించాల్సిన సివిల్ సప్లై అధికారులు కూడా ఎఫ్‌సీఐ నుంచి వచ్చే హెచ్చరికలను పట్టించుకోవడం లేదు. అటు మిల్లర్లకు కూడా భరోసాగా ఉండటంతో లెక్కకు రాని బియ్యంగానే మారుతున్నాయి. అసలు సీఎంఆర్ బియ్యంపై సంబంధిత మంత్రి, సివిల్​సప్లై అధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారనేది అంతు చిక్కకుండానే మారుతోంది.

మిల్లర్లే బెదిరిస్తున్నారా.. మిల్లర్ల బెదిరింపులకు మంత్రి, అధికారులు భయపడుతున్నారంటూ సివిల్ సప్లై అధికారుల్లోనే చర్చ జరుగుతోంది. ఇదే భరోసాతో మిల్లర్లు కస్టం మిల్లింగ్‌ను ఎగవేస్తున్నారు. ప్రభుత్వ ధాన్యంతో దర్జాగా వ్యాపారం చేసుకుంటున్నారు. తాజాగా ఎఫ్‌సీఐ మరోసారి దీనిపై నోటీసు ఇవ్వడంతో ప్రభుత్వం మిల్లులను బ్లాక్​లిస్టులో పెట్టినట్టే పెట్టి మళ్లీ ఇప్పుడు ధాన్యం ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది.

Next Story

Most Viewed