దసరా దావత్‌లో కొడుకును నరికిన తండ్రి.. ఓపిక నశించడమే కారణమా..?

by  |
దసరా దావత్‌లో కొడుకును నరికిన తండ్రి.. ఓపిక నశించడమే కారణమా..?
X

దిశ, శాయంపేట : హన్మకొండ జిల్లా శాయంపేటలో దసరా పండుగ నాడు దారుణం చోటుచేసుకుంది. తండ్రి చేతిలో కొడుకు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన మండలంలోని కొత్త గట్టు సింగారంలో శుక్రవారం వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. కొత్త గట్టు సింగారం గ్రామానికి చెందిన రేగూరి రవీందర్ రెడ్డి కూలి పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.అతనికి మూడేండ్ల కొడుకు ఉన్నాడు. రవీందర్ రెడ్డి ఇటీవల మద్యానికి బానిసవ్వగా.. భార్యను శారీరకంగా, మానసికంగా వేధించడంతో భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది.

రవీందర్ రెడ్డి అత్తగారిది ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఇన్ఛాన్ చెరువుపల్లి గ్రామం.ఆమె గత రెండేళ్ల నుంచి తల్లి వద్దే ఉంటుండగా.. రవీందర్ రెడ్డి ఆయన తండ్రి పాపిరెడ్డి ఇద్దరు కొత్తగట్టు సింగారంలోనే ఉంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే రవీందర్ రెడ్డి మద్యం తాగి వచ్చి తన తండ్రి పాపిరెడ్డిని బూతులు తిడుతూ చితకబాదేవాడు.

దసరా పండుగ నాడు తండ్రీకొడుకులు ఇద్దరూ కలిసి మద్యం తాగిన అనంతరం గొడవ పడ్డారు. ఈ క్రమంలోనే కొడుకును తండ్రి పాపిరెడ్డి గొడ్డలితో తలపై బలంగా కొట్టాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై రవీందర్ రెడ్డి మరణించినట్టు మృతుడి భార్య రేవూరి సునీత ఫిర్యాదు మేరకు శాయంపేట ఎస్ఐ ప్రవీణ్ కుమార్ కేసు నమోదు చేయగా.. సీఐ తోగాటి రమేష్ కుమార్ కేసును దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.


Next Story

Most Viewed