పెళ్లయిన 5వ రోజే మౌనిక కిడ్నాప్.. భర్త ఏం చేశాడంటే..!

by  |
పెళ్లయిన 5వ రోజే మౌనిక కిడ్నాప్.. భర్త ఏం చేశాడంటే..!
X

దిశ , పెద్దపల్లి : కొత్తగా పెళ్లయిన ఐదో రోజే నవ వధువు కిడ్నాప్ అయ్యింది. సినీ ఫక్కీలో కిడ్నాప్ జరిగినట్లు సమాచారం. కొందరు వ్యక్తులు వరుడి ఇంటి మీదకు వచ్చి దౌర్జన్యంగా ఆమెను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్‌లో ఇవాళ ఉదయం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే..ఈనెల 15న సుల్తానాబాద్‌కు చెందిన కరుణాకర్, హైదరాబాద్‌కు చెందిన మౌనిక ఎవరికీ తెలియకుండా ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరిది ఒకే కమ్యూనిటీ కాదు. ఈ విషయం తెలుసుకున్న అమ్మాయి తండ్రి సరిగ్గా ఐదో రోజు కిరాయి గుండాల సాయంతో కన్న కూతురుని కిడ్నాప్ చేసేందుకు యత్నించాడు. ఆ సమయంలో అడ్డుకునేందుకు యత్నించిన భర్త కరుణాకర్ కుటుంబంపై దాడి చేసినట్లు తెలుస్తోంది. ఆ వెంటనే ప్రాణ భయంతో కరుణాకర్ కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.

కరుణాకర్, మౌనిక ఇద్దరూ హైదరాబాదులో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసేవారు. వర్క స్టేషన్‌లో ఏర్పడిన వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. ఇద్దరివి వేర్వేరు కులాలు కావడంతో ఇంట్లో చెప్పకుండా ఈనెల 15న పెళ్లి చేసుకున్నారు. దీంతో ఆగ్రహించిన మౌనిక తండ్రి కూతుర్ని ఆమె భర్త దగ్గర నుంచి ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే, అమ్మాయి తండ్రి నుంచి తనకు ప్రాణహాని ఉందని కరుణాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనకు న్యాయం జరిగేలా చూడాలని కోరగా.. మౌనికను తీసుకెళ్లిన వారి ఆచూకీ తెలుసుకున్న పోలీసులు ఆమెను సుల్తానాబాద్‌కు తీసుకొచ్చారు. పెద్దపల్లి ఏసీపీ ఆధ్వర్యంలో నవ దంపతులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం ఇంటిపై దాడి చేసి అమ్మాయిని ఎత్తుకెళ్లేందుకు యత్నించిన ముగ్గురిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ సారంగపాణి తెలిపారు.



Next Story

Most Viewed