ఒకరికోసం ఇంకొకరు.. తండ్రీ కొడుకులు మృతి

by  |
ఒకరికోసం ఇంకొకరు.. తండ్రీ కొడుకులు మృతి
X

దిశ, దుబ్బాక : సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. మండల పరిధిలోని ఎల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన తండ్రీ, కొడుకులు శుక్రవారం సాయంత్రం గ్రామ శివారులో గల మల్లన్నసాగర్ ప్రాజెక్టు కాలువలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలుసుకున్న స్థానికులు, గ్రామస్తులు ఘటనా స్థలికి చేరుకుని గల్లంతైన తండ్రి రాజిరెడ్డి(45),కొడుకు శ్రీనివాస్ రెడ్డి (19)ల అచూకీ కోసం రాత్రి 10 గంటల వరకు వెతికారు. అయినా ఫలితం లేకపోవడంతో గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు చివరిసారిగా కాలువలో వెతకగా ఇద్దరి మృతదేహాలు లభ్యయ్యాయి.

రాత్రి 11గంటల ప్రాంతంలో ఇద్దరి మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట ఆస్పత్రికి తరలించారు. గ్రామస్తుల కథనం ప్రకారం.. రాజిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి అనే ఇద్దరు తండ్రి కొడుకులు తమ వ్యవసాయ పొలం వద్ద సాయంత్రం వరకు పనులు చేసుకొని ఇంటికి వెళ్తున్న క్రమంలో స్నానం చేసి వెళ్లాలనుకున్నారు. ముందు కొడుకు శ్రీనివాస్ రెడ్డి కాలువలో దూకగా ఈత రాక నీటిలో మునుగుతుండగా, కళ్ల ముందే కొడుకు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుండటాన్ని గమనించిన తండ్రి వెంటనే కాలువలోకి దూకాడు. అయితే, కొడుకు తండ్రీని గట్టిగా పట్టుకోవడంతో బయటకు రావడం సాధ్యం పడలేదు. దీంతో తండ్రీకొడుకులు ఇద్దరు నీటిలో మునిగిపోయి ఊపిరాడక మృతి చెందారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తొగుట పోలీసులు తెలిపారు.



Next Story

Most Viewed