వారి దోపిడీపై ధ్వజమెత్తిన కాంగ్రెస్ నేతలు.. అరెస్ట్ చేసిన పోలీసులు

by  |
వారి దోపిడీపై ధ్వజమెత్తిన కాంగ్రెస్ నేతలు.. అరెస్ట్ చేసిన పోలీసులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని యాసంగిలో ధాన్యం కొనుగోళ్లలో తరుగు పేరుతో మిల్లర్ల దోపిడీని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమయ్యిందని, మిల్లర్లు అధికారులు కలిసి రూ. వెయ్యి కోట్ల వరకూ రైతులకు నష్టం జరిగిందని కిసాన్ కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు సుంకేట అన్వేష్ రెడ్డి పేర్కొన్నారు. పౌర సరఫరాల శాఖ కమిషనర్ కి బుధవారం కిసాన్ కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేసేందుకు కార్యాలయానికి చేరుకోగా పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా కిసాన్ కాంగ్రెస్ సభ్యులు మాట్లాడుతూ.. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి పంపించిన నాటి నుంచి మిల్లుకు తరలించేవరకూ ఆ భారమంతా రైతులే భరించాల్సి వచ్చిందని, వానకి ధాన్యం తడిసినా రైతే నష్టపోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

తూకం వేశాక రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఇచ్చిన ట్రాక్ షీట్ ఆధారంగా కాకుండా మిల్లర్లు చెప్పిన విధంగా రైతులకు డబ్బులను జమ చేయడం సరికాదన్నారు. ఇలా చేయడం వల్ల ఒక్క లారీకి రూ.20వేల నుంచి రూ.30వేల వరకూ రైతు నష్టపోయారన్నారు. ఇలా రాష్ట్రంలోని ఎందరో రైతులు నష్టపోయారని కేవలం వికారాబాద్ జిల్లాలోని కుల్కచర్ల మండలంలోని 4 గ్రామాల్లోని రైతులకు రూ.20.70 లక్షలు తక్కువ వచ్చాయన్నారు. ఇలా మొత్తం రాష్ట్రంలో పౌరసరఫరాల శాఖ ఇచ్చిన ట్రాక్ షీట్ కి భిన్నంగా రైతులకు ఇచ్చారని, ఈ క్రమంలో దాదాపు రూ.వెయ్యి కోట్ల వరకూ నష్టపోయామని దీనిపై విచారణ జరపాలని కిసాన్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. వర్షం వల్ల లేదా ఇతర కారణాల ద్వారా నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రాబోయే వానాకాలం పంట ధాన్య సేకరణకు రైతు సంఘాలతో సంప్రదింపులు జరిపి, మొత్తం కొనుగోళ్లు పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో నష్టం జరిగిన రైతుల వివరాలు తెలుపుతూ కమిషనర్ కి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Next Story

Most Viewed