కరుణించని వరుణుడు.. కన్నీరు పెడుతున్న రైతన్న..

by  |
కరుణించని వరుణుడు.. కన్నీరు పెడుతున్న రైతన్న..
X

దిశ, నిజామాబాద్ రూరల్: గత నెల రోజులుగా వర్షాలు ముఖం చాటేశాయి. ఆరుతడి పంటలు సాగు చేసే రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. జూలై మాసంలో కురిసిన వర్షాలకు ఉమ్మడి జిల్లాల్లోని వాగులు, చెరువులు, కుంటలు నిండి మత్తళ్లు దూకాయి. ఈ నేపథ్యంలో వర్షం ఆధారం లేని పంటలకు గత 25 రోజుల నుండి ఉమ్మడి జిల్లాల్లో వర్షాలు లేక సోయా పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. అదేవిధంగా మొక్కజొన్న పంట కూడా దెబ్బ తిందని రైతులు పేర్కొంటున్నారు. ఉమ్మడి జిల్లాల్లో సోయ పంట 20 ఇరవై వేల ఎకరాల్లో సాగుచేయడానికి లక్ష్యంగా పెట్టుకున్నట్లు జిల్లా వైద్యాధికారి గోవింద్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆరుతడి పంటలు వేసిన రైతులు వర్షాలు లేక తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సోయా రైతులకు ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం ఇప్పించాలని పేర్కొంటున్నారు.

జులై మాసంలో కురిసిన వర్షాలకు అధికంగా నీరు చేరి సొయా పంట తీవ్రంగా దెబ్బతిందని ప్రస్తుతం ఇప్పుడు వర్షాలు లేక మళ్లీ పంట నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే దాదాపు పదిహేను వేల ఎకరాల్లో సోయా పంటకు పూర్తిగా నష్టం వాటిల్లిందని అన్నదాతలు పేర్కొంటున్నారు. నేపథ్యంలో భూగర్భ జలాల లేక, సాగునీటి వసతులు లేక ఆరుతడి పంటలు వేసుకుంటే అది కూడా తీవ్ర వర్షాభావ పరిస్థితి నెలకొందని పంటలు పండే పరిస్థితి లేదని రైతులు తెలిపారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్లో నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాల్లో సోయాకు మొక్కజొన్నకు రైతులు ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తారు. వీటికి దాదాపు 15 నుండి 18 రోజుల వరకు నీరు అందించకుండా ఆరుతడి పంటలకు నష్టం వాటిల్లదని వ్యవసాయ నిపుణులు పేర్కొంటున్నారు.

తర్వాత కూడా నీరు అందించకుంటే వాడిపోయి పంట చేతికి రాదని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. ఉమ్మడి జిల్లాల్లో ఎక్కువ శాతం వరి పంట సాగుచేసుకుంటూ సోయా, మొక్కజొన్న, కంది, పెసర, మినుము పంటలను రైతులు పండిస్తారు. కానీ గత నెల రోజులుగా వర్షాలు ముఖం చాటేయడంతో ఆరుతడి పంటలకు తీవ్రంగా నష్టం వాటిల్లిందని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. వర్షాలు లేక సోయా పంటలు దెబ్బతిన్న రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకొని పంట నష్టపరిహారాన్ని అందించాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఆరుతడి పంటలు వేసిన రైతులు నష్టపోవడం పంట పెట్టుబడితో ఖర్చులన్నీ తామే భరించాలని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా కాళేశ్వరం ప్రాజెక్టు నుండి ప్యాకేజీ 20,21 ద్వారా రూరల్ మండలాలకు సాగునీరు అందించే పైలెట్ కార్యక్రమం ఇంకా మొదలు కాకపోవడంతో రైతన్నలు ఆందోళన నెలకొంది. వరి పంట కూడా ఎండిపోయే పరిస్థితి నెలకొంటుందని రైతులు పేర్కొంటున్నారు.

ఇప్పటికే అనేక సభలు సమావేశాల్లో రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ కవిత, వీజీగౌడ్ లు తమ సమావేశాల్లో రూరల్ నియోజకవర్గానికి పైలట్ కార్యక్రమం ద్వారా ఇరవై వేల ఎకరాలకు నీరందించే కార్యక్రమం జూన్ నుండి పంటలకు నీరు అందిస్తామని చెప్పి ఇప్పటి వరకు చుక్క నీరు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మంచిప్ప రిజర్వాయర్ నుండి చుక్క నీరు అందించలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. కాళేశ్వరం ద్వారా రూరల్ నియోజకవర్గానికి నీళ్లందించే కార్యక్రమం ఎప్పుడు పూర్తవుతుందో? తమ బీడు భూములు ఎప్పుడు సాగు భూములుగా మారిపోతాయోనని రైతులు కళ్లల్లో ఒత్తులు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా గురించి కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 20,21 ద్వారా మంచిప్ప రిజర్వాయర్ నుండి రూరల్ గ్రామాలకు లక్షా ఐదువేల ఎకరాలకు సాగు నీరందించే కార్యక్రమం ఎప్పుడనెేది ప్రజలు ఎదురు చూస్తున్నారు.

మంచిప్ప రిజర్వాయర్ నిర్మాణం ద్వారా భూములు కోల్పోయిన నిర్వాసితులకు ఇప్పటికీ భూములు ఎక్కడా చూపలేదు. అదేవిధంగా రిజర్వాయర్ ఏర్పాటుతో మూడు తండాలు నీటిమునుగుతాయని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. ముంపునకు గురయ్యే గ్రామాల ప్రజలకు శాశ్వతంగా పునరావాసాన్ని కల్పించాలని గతంలోనే రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ కు మోపాల్ మండల మంచిప్ప గ్రామ ప్రజలు మొరపెట్టుకున్నారు.

Next Story

Most Viewed