ధాన్యం విక్రయాల్లో అడ్డదారులు.. దళారుల విక్రయాలు!

by  |
Preddy1
X

దిశ, కాటారం: ఆరుగాలం శ్రమించి రైతులు పండించిన వరి ధాన్యం మద్దతు ధరకు విక్రయించి లాభం పొందాలన్న రైతుల ఆశలకు గండిపడ్డాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆలస్యంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభంకావడం, ఇప్పుడు అల్పపీడన ప్రభావం మూలంగా వర్షాలు పడడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ధాన్యం విక్రయానికి రైతులు ఈ ఏడాది అష్టకష్టాలు పడుతున్నారు. తేమ, తరుగు, నూకల పేరిట రైస్ మిల్లర్లు రైతులకు తీవ్రంగా కోతలు విధిస్తుండడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. కొన్ని రోజులుగా రైస్ మిల్లులకు ధాన్యం తరలింపులో కాంట్రాక్టర్ కొనుగోలు కేంద్రాలకు లారీలను కేటాయించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. రైతులు రోజుల తరబడి కల్లాల వద్దనే వేచి చూస్తున్నారు. చివరకు చేసేదేమి లేక రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా గ్రామాల్లోని దళారులు రైతుల అవసరాలను ఆసరాగా చేసుకొని ప్రభుత్వ మద్దతు ధర చెల్లించకుండా క్వింటాల్ కు రూ. 1,500 నుండి 1,650 ధర చెల్లిస్తున్నారు.

కాటారం, మహదేవ్ పూర్ మండలాల నుండి పక్క జిల్లా మంచిర్యాల ప్రాంతానికి ఈ ప్రాంతంలో దళారులు ఖరీదు చేసిన వరి ధాన్యాన్ని ఆ ప్రాంతాల్లోని ఐకేపీ సెంటర్ల నిర్వాహకులు, దళారులు కుమ్మక్కై నేరుగా రైస్ మిల్లర్లకు ధాన్యాన్ని చేరవేస్తున్నారు. ఐకేపీ సెంటర్ల ద్వారా పంపిణీ చేస్తున్న గోనె సంచులను బహిరంగ మార్కెట్ లో ఖరీదు చేసి కొందరు, మరికొందరు మిల్లర్ల దగ్గర తీసుకువచ్చి తక్కువ ధరకు ధాన్యాన్ని విక్రయించే రైతులకు పంపిణీ చేసి, ఇక్కడ కాంటాలు చేసుకుని ఆ ప్రాంత లారీలలో లోడింగ్ చేస్తున్నట్లు పలువురు తెలిపారు. పొరుగు జిల్లాలోని ఐకేపీ సెంటర్ నిర్వాహకులతో దళారులు ఒప్పందాలు కుదుర్చుకొని దళారులకు దగ్గరగా ఉన్న ఆ ప్రాంత రైతుల జాబితా, సెల్ నెంబర్లను ఐకేపీ సెంటర్ నిర్వాహకులకు ఇస్తున్నారు. లోడింగ్ పూర్తయిన లారీని ఐకేపీ సెంటర్ నిర్వాహకులు ఏ రైస్ మిల్ కు తీసుకెళ్లాలో నిర్దేశిస్తారు. నేరుగా ఆ దళారి ఆ లారీని రైస్ మిల్ కు తరలిస్తున్నారు.

ఇలా అక్రమ వ్యాపారం చేస్తూ దళారులు క్వింటాల్ ధాన్యానికి సుమారు 200 రూపాయల లాభాన్ని ఆర్జిస్తున్నట్లు సమాచారం. కాటారం సబ్ సబ్ డివిజన్ పరిధిలో ధాన్యం కొనుగోలు బాగా మందగించడంతో ఈ ప్రాంతం నుండి పొరుగు జిల్లా మంచిర్యాలకు ప్రతిరోజు దళారులు ధాన్యం రవాణా చేస్తూ అక్రమంగా సంపాదించుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. మిల్లర్లు సైతం ఐకేపీ సెంటర్ల ద్వారా వచ్చే ధాన్యానికి రూ. 50 వరకు కటింగ్ చేస్తూ కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. ఫలితంగా ఈ ప్రాంత రైతులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించుకునే పరిస్థితి లేక ఆర్థికంగా నష్టపోతున్నారు.

ధాన్యం రవాణాలో మడత పేచీ?

కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తూకం జరిగిన పిదప బస్తాలను రైస్ మిల్లులకు లారీల ద్వారా తరలిస్తారు. ఇప్పుడు ధాన్యం రవాణా చేయడంలో కిరాయి గిట్టుబాటు కావడం లేదంటూ లారీ కాంట్రాక్టర్ పూర్తిస్థాయిలో లారీలను ఆయా కొనుగోలు కేంద్రాలకు కేటాయించకపోతుండటంతో కాంట అయిన బస్తాలు కేంద్రాల్లోనే ఉండిపోతున్నాయి. ఈ ఏడాది కొనుగోలు కేంద్రాల నుండి రైస్ మిల్లులకు ధాన్యం రవాణా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలువలేదు. గత ఏడాది రవాణా రేటుతోనే లారీ కాంట్రాక్టర్లు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. రవాణా ఛార్జీలు ఒప్పందం కుదుర్చుకునే ముందే డీజిల్ ధరలు పెరిగాయి. ప్రభుత్వం టెండర్లు పిలవకపోవడంతో ధాన్యం రవాణా చేసేందుకు కొత్తవారికి అవకాశం లభించలేదు. ఇదే అదునుగా గత ఏడాది కాంట్రాక్టర్ ప్రభుత్వంతో అప్పటి రవాణా ఛార్జీల ప్రకారం రవాణా చేసేందుకు అగ్రిమెంట్ చేసుకున్నారు. ద్వారా ఈ కాంట్రాక్టు ఎవరికీ చెందకుండా వ్యవహరించారు. కొన్ని రోజుల పాటు ధాన్యం రవాణా చేసిన ట్రాక్టర్ ఇప్పుడు రవాణా ఛార్జీలు గిట్టుబాటు కావడం లేదని, ధాన్యం కొనుగోలు కేంద్రాలకు పూర్తిస్థాయిలో లారీలను సరఫరా చేయకపోతుండడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య తేలకపోవడంతో కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తూకం చేయడంలో ఆలస్యం అవుతుండడంతో ధాన్యం కుప్పలు పెరిగిపోతున్నాయి కానీ, రైతుల ఇబ్బందులు తప్పడం లేదు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మరికొన్ని నెలల పాటు ఖరీఫ్ సీజన్ ధాన్యం విక్రయాల కోసం రైతులు కేంద్రాల్లోనే పడిగాపులు పడాల్సి వస్తుంది.


Next Story

Most Viewed