సర్కారు నిర్లక్ష్యం.. IKP సెంటర్లలో సాకులు.. అయోమయంలో అన్నదాత

by  |
సర్కారు నిర్లక్ష్యం.. IKP సెంటర్లలో సాకులు.. అయోమయంలో అన్నదాత
X

దిశ, టేకుమట్ల : ఆరుగాలం కష్టపడి పండించిన వరి పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అగచాట్లు పడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. టేకుమట్ల మండలంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐకేపీ సెంటర్లలో వడ్లు కొనేందుకు అధికారులు, సిబ్బంది.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అన్నదాతలను అయోమయానికి గురి చేస్తున్నారు. కొన్ని గ్రామాలలో ఇప్పటివరకు ఐకేపీ సెంటర్లను ప్రారంభించకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ప్రారంభించిన వాటిల్లో కాంటాలు మొరాయించడం, గన్ని సంచుల కొరతవంటి కుంటి సాకులు చెబుతూ అధికారులు, సిబ్బంది కాలం వెళ్లబుచ్చుతున్నారు. ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఆరబోసిన ధాన్యం మొత్తం తడిసి ముద్దవడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే స్పందించి మండలంలోని ఐకేపీ సెంటర్లలో ధాన్యం కొనే విధంగా చర్యలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

వరి వేస్తే ఉరి..

వానాకాలం పంటను ప్రభుత్వం కొనకపోవడంతో ఆందోళనలో ఉన్న రైతన్నకు యాసంగి సీజన్‌లో వరి వేస్తే ఉరి అని ప్రభుత్వం చెప్పడంతో మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా అన్నదాతల పరిస్థితి నెలకొంది. ఏ పంటలు విత్తుకోవాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో అన్నదాతలు ఉన్నారు. దీనికి తోడు అకాల వర్షాలతో కంటి మీద కునుకు లేకుండా బతుకు జీవుడా అంటూ కాలం వెళ్లదీసే పరిస్థితుల్లో అన్నదాతలు కొట్టుమిట్టాడుతున్నారు.


Next Story