ధరణి చార్జీలపై రైతులు అసహనం

by  |
ధరణి చార్జీలపై రైతులు అసహనం
X

దిశ ప్రతినిధి,కరీంనగర్/వరంగల్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ధరణి పోర్టల్ సమస్యలతోనే ఆరంభమైంది. చాలా చోట్ల సర్వర్ డౌన్ సమస్య తలెత్తింది. ఉమ్మడి కరీంనగర్‌లో ఎకరానికి రూ.2500 చార్జీలు తీసుకోవడంపై రైతులు అసహనం వ్యక్తం చేశారు. వరంగల్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియలో సాంకేతిక లోపాలు తలెత్తాయి. ఉమ్మడి కరీంనగర్‌ లో సర్వర్ డౌన్ కావడంతో దాదాపు రెండు గంటలు ఆలస్యంగా పోర్టల్ ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం సత్వర సేవలు అందిస్తున్నామని ప్రకటించినప్పటికీ తమపై ఆర్థిక భారం మోపేలా చార్జీలు వసూలు చేస్తున్నారని రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

గతంలో ఉచితంగా చేసిన ప్రక్రియకు కూడా ఇప్పుడు చార్జీలు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూమి క్రయవిక్రయాలకు సంబంధించిన స్టాంపు డ్యూటీ చెల్లించడంతో పాటు ఎకరాకు రూ. 2500 చెల్లించాల్సి వస్తోందని వాపోతున్నారు. గతంలో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో స్టాంపు డ్యూటీ చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత మ్యూటేషన్ కోసం రెవెన్యూ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే సరిపోయేది. అలాగే వారసత్వంగా సంక్రమించే ఆస్తులను డిపెండెంట్స్ పేరిట విరాసత్ చేసేందుకు కూడా ఎలాంటి డబ్బులు వసూలు చేసేవారు కాదని, గిఫ్ట్ డీడ్‌కు కూడా రెవెన్యూ విభాగానికి డబ్బు చెల్లించే అవసరం ఉండేది కాదు. కానీ వీటన్నింటికి కూడా ఎకరాకు రు. 2500 చొప్పున డబ్బు చెల్లించాల్సి వస్తోందని రైతన్నలు వాపోతున్నారు.

స్లాట్ బుకింగ్ సమస్యలు..

పట్టాదారు పేరు మార్పిడీ కోసం ముందుగా మీ సేవా కేంద్రాల ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్లాట్ బుకింగ్ చేసుకున్నప్పుడు హద్దులతో పాటు, సాక్షులు ఇతరత్రా అన్ని వివరాలు కూడా అప్ లోడ్ చేయాల్సి ఉంటోంది. మీ సేవా ద్వారా పొందుపర్చిన వివరాలతో పాటు సాక్షులు కూడా తహసీల్దార్ కార్యాలయానికి ఖచ్చితంగా వెళ్లాల్సి ఉంటున్నది. మీ సేవా ద్వారా అప్‌లోడ్ చేసిన వివరాలను రిజిస్ట్రేషన్ సమయంలో సరితూగనట్లయితే పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ధరణి పోర్టల్ ద్వారా కేవలం పట్టాదారు పేరు మార్పిడి, రిజిస్ట్రేషన్ వంటి నాలుగు రకాల సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే పట్టదారు పేరు తప్పులు పడినా, లేక విస్తీర్ణం ఎంత అని అప్ లోడ్ చేసే ప్రక్రియలో తప్పు జరిగినా సవరించే అవకాశం లేదు.

వరంగల్‌లో సమస్యలతో మొదలు..

తహసీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియలో సాంకేతిక లోపం తలెత్తడంతో రిజిస్ర్టేషన్లు నిలిచిపోయాయి. జిల్లా వ్యాప్తంగా తొలి రోజు 14 మంది స్లాబ్ బుక్ చేసుకున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా హసన్ పర్తిలో రిజిస్ర్టేషన్ల ప్రక్రియను కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, రూరల్ జిల్లా నెక్కొండలో కలెక్టర్ హరిత ప్రారంభించారు. వరంగల్ అర్బన్ జిల్లా హసన్‌పర్తి మండలంలో తొలి రిజిస్ట్రేషన్ జరిగింది. రేపాకపల్లెకు చెందిన అడిగొప్పుల మల్లేశం కొడుకుకు వీరస్వామికి 1.03 ఎకరాల భూమిని గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేశాడు. ధరణి పోర్టల్ ద్వారా తాహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియకు కొంత ఆటంకం ఏర్పడింది. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత డాక్యూమెంట్స్‌పై అధికారులు సంతకాలు చేసి కొనుగోలుదారుడికి ఇవ్వాలి. ఐతే రివర్స్ ఎండార్స్‌మెంట్ ప్రింటర్ వద్ద టెక్నికల్ సమస్య వచ్చింది. డాక్యూమెంట్స్ ప్రింటింగ్ రాకపోవడంతో ఇబ్బంది పడ్డారు. దీంతో రిజిస్ర్టేషన్ ప్రక్రియ పూర్తి కాలేదు. ఈ సమస్యను స్థానిక ఉద్యోగులు సంబంధిత రాష్ట్ర సాంకేతిక విభాగం దృష్టికి తీసుకెళ్లారు.



Next Story

Most Viewed