చట్టాలను వెనక్కి తీసుకోవాలి: రైతులు

by  |
చట్టాలను వెనక్కి తీసుకోవాలి: రైతులు
X

న్యూఢిల్లీ: దేశ రాజధాని సరిహద్దులో ఏడో రోజూ ఆందోళన కొనసాగించిన రైతులు కేంద్రం తీసుకువచ్చిన మూడు నూతన సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని, దానికోసం ప్రత్యేకంగా పార్లమెంటు సమావేశాన్ని నిర్వహించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించకుంటే ఢిల్లీలోకి వెళ్లే ఇతర మార్గాలనూ దిగ్బంధిస్తామని హెచ్చరించారు. కొత్త సాగు చట్టాలను వెనక్కి తీసుకోకుంటే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని విలేకరుల సమావేశంలో రైతు నాయకుడు గుర్నాం సింగ్ చదోని స్పష్టం చేశారు. ఆందోళన చేస్తున్న రైతు సంఘాల నేతలతో కేంద్ర ప్రభుత్వం బుధవారం సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ చర్చలు అసంపూర్తిగా మిగలడంతో గురువారమూ సమావేశమవ్వాలని నిర్ణయించింది. చట్టాల్లోని సమస్యాత్మక అంశాలను బుధవారం సమర్పిస్తే సమావేశంలో వాటిని చర్చించవచ్చునని సూచించింది. గురువారంనాటి సమావేశానికి రైతు సంఘాలు కసరత్తు చేశాయి. పలుసార్లు రైతు సంఘాలు సమావేశమై చర్చలు జరిపాయి. కొత్త సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిందేనన్న ఉమ్మడి అభిప్రాయానికి వచ్చాయి. రైతులతో కేంద్రమంత్రులు గురువారం మరోసారి చర్చలు నిర్వహించనున్నారు.


Next Story

Most Viewed