పాపం అన్నదాత.. నాలుగు నెలల కష్టం నీళ్ల పాలాయే..!

by  |
పాపం అన్నదాత.. నాలుగు నెలల కష్టం నీళ్ల పాలాయే..!
X

దిశ, చందుర్తి : ఉమ్మడి కరీంనగర్ జిల్లా చందుర్తి మండల కేంద్రంలోని గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ మధ్యే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అయితే, ధాన్యం కొనుగోలు ఆలస్యం కావడంతో రైతులు గత కొన్ని రోజులుగా ఆందోళన చెందుతున్నారు. ఈ విషయం అధికారులు, ప్రజాప్రతినిధులకు కూడా తెలుసు. అయితే, వీరు చేసిన నిర్లక్ష్యానికి రైతులు మరోసారి నష్టపోయారు. చందుర్తి మండల కేంద్రంలో గత రాత్రి కురిసిన అకాల వర్షానికి తిమ్మాపురం గ్రామానికి చెందిన పిట్టల అజయ్ తండ్రి దేవయ్యకు చెందిన ధాన్యం దాదాపు 10 క్వింటాళ్ల మేర కళ్ల ముందే కొట్టుకుపోతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఆ రైతు ఉండిపోయాడు.

రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అకాల వర్షం నాశనం చేసింది. నాలుగు నెలల కష్టం ఒక్క వర్షానికే కొట్టుకుని పోవడంతో బాధిత రైతు కన్నీరుమున్నీరయ్యాడు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినా మిల్లర్ల కొర్రీలతో వరి పంట కొనుగోళ్లు మందకోడిగా సాగుతున్నాయి. పొల్లు, తాలు, తేమ తదితర కారణాలు చూపుతూ మిల్లర్లు 40 కిలోల వరి ధాన్యానికి తరుగు పేరిట రెండున్నర కిలోల ధాన్యాన్ని కట్ చేస్తున్నారు.

వారం రోజులుగా కమ్మేస్తున్న పొగ మంచుకు తోడు రాత్రి కురిసిన అకాల వర్షంతో కళ్లాల్లో ఆరబెట్టిన ధాన్యం మొత్తం తడిసి ముద్దయింది. కుప్పలు చేసి కవర్లు కప్పుతున్న సమయానికే వడ్లు తడిసిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు వాతావరణంలోని తేమ, అకాల వర్షాలు, పెరిగిన పెట్టుబడులు, ఖరీఫ్‌లో తగ్గిన దిగుబడితో వ్యవసాయం చేయడమే దండగా అనే పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు.

మొన్నటివరకు రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజను మేమే కొంటామని చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. కొనుగోళ్లు ఎందుకు ఆలస్యంగా చేపడుతున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి నష్టపోయిన రైతుల పంటను అంచనా వేసి పరిహారం చెల్లించాలని బాధిత అన్నదాతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.


Next Story

Most Viewed