సాగుకు రెడీ.. రైతులు నాట్ రెడీ

by  |
సాగుకు రెడీ.. రైతులు నాట్ రెడీ
X

దిశ, మహబూబ్‌నగర్: వానాకాలం పంటల సాగుకు వ్యవసాయశాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా అన్నదాతకు కావాల్సిన ఎరువులు, విత్తనాలకు కొరత లేకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో పలు చోట్ల చిరుజల్లులు కురుస్తున్న నేపథ్యంలో త్వరలోనే పూర్తిస్థాయిలో వర్షాలు కురిసే అవకాశాలు ఉంటాయని అటు రైతులు, ఇటు అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కొందరు రైతులు తొలకరి జల్లులను ఆసరాగా చేసుకుని దుక్కులు దున్నుతున్నారు. ఈసారి గతేడాది కంటే లక్ష ఎకరాల వరకు అదనంగా పంటలు సాగు అయ్యే అవకాశాలు ఉన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ముఖ్యంగా వివిధ ప్రాజెక్టు పనులు చివరి దశలో ఉన్న నేపథ్యంలో సాగునీటి లభ్యత ఆధారంగా జిల్లాలో పంటసాగు పెరిగే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు.

గతేడాది వానాకాలంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 7లక్షల ఎకరాలలో రైతులు పంటలు సాగు చేయగా ఈసారి అంతకు పైచిలుకు సాగయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే రైతులకు కావాల్సిన విత్తనాలను అధికారులు అయా మండల కేంద్రాలకు తరలించే పనులలో నిమగ్నమయ్యారు. సుమారు లక్ష క్వింటాళ్ల విత్తనాలను అధికారులు సిద్ధంగా ఉంచారు. అయితే, జిల్లాలో అత్యధికంగా వరి సాగు ఉండటంతో ఆఫీసర్లు బీపీటీ వరి విత్తనాలపై అధిక దృష్టి కేంద్రీకరించారు. గతేడాది సాగును అధారంగా చేసుకుని జిల్లాలో రైతులు 1లక్ష25వేల హెక్టార్లలో వరి సాగు, లక్ష 85వేల హెక్టార్లలో పత్తిని సాగుచేస్తారని అంచనా. లక్షా 40 వేల హెక్టార్లలో కందులు, లక్షా 25 వేల హెక్టార్లలో మొక్కజొన్న, 60 వేల హెక్టార్లలో మొక్కజొన్న, 60 వేల హెక్టార్లలో అముదం పంటలు సాగు చేస్తారని అంటున్నారు. రైతులకు సుమారు 3 లక్షల 20 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం అవుతాయనీ, అందుకనుగుణంగా ఇప్పటికే లక్షా 10 వేల మెట్రిక్ టన్నుల ఎరువులను సిద్ధంగా ఉంచినట్లు అధికారులు చెబుతున్నారు.

ఏ పంటలు వేయాలనే అయోమయం..

సాగు పరిస్థితి ఎలా ఉన్నా రైతుల్లో మాత్రం రైతుబంధు అందోళన మొదలైంది. ప్రభుత్వం సూచించిన పంటలనే సాగు చేయాలని లేదంటే రైతు బంధుతో పాటు మద్దతు ధర కూడా వర్తించదనే ప్రచారం జిల్లాలో జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో అసలు ప్రభుత్వం ఏ పంటలను వేయాలని సూచిస్తుందో అనే అయోమయం రైతుల్లో నెలకొంది. పంటల విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ రైతులు చాలా నష్టాలను చవిచూడాల్సి వస్తుందనీ, అలాంటి సందర్భంలో ప్రభుత్వం సూచించే పంటలు వేసి నష్టపోతే దానికి ప్రభుత్వం భాధ్యత వహిస్తుందా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. వ్యవసాయంలో ప్రకృతి భాగమేననీ, ఒకవేళ ఏదైనా విపత్తు సంభవిస్తే ప్రభుత్వం తక్షణ సాయం చేస్తుందా? అని అడుగుతున్నారు. అందుకు గ్యారెంటీ ఇస్తుందా అని అంటున్నారు. మరికొందరు రైతులు రైతు బంధుకు, వేసే పంటలకు లింకు పెట్టడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. చాలా కాలంగా తాము వేస్తున్న పంటలను కాదనీ, కొత్త పంటలను వేయడం వల్ల కొంత ఇబ్బందులు తప్పవేమోననీ చెబుతున్నారు. నీటి లభ్యతతో పాటు భూమి స్వరూపాన్ని బట్టి పంటలు వేస్తారనీ, ఒకవేళ నీటి లభ్యత లేకుండా ఉంటే ప్రభుత్వం సూచించే పంటలు వేయడం సాధ్యం కాదని అంటున్నారు.

పంటలు సూచించడం సరికాదు: బోజారెడ్డి, రైతు

నాకున్న మూడున్నర ఎకరాలలో గతేడాది నీటి కొరత కారణంగా పత్తి పంటను సాగు చేశాను. కాని ఈసారి ప్రభుత్వం వరి పంట సాగు చేయాలని అదేశిస్తే ఆ పంటను సాగు చేసేదానికంటే నా భూమిని బీడు పెట్టడం మంచిదనుకుంటున్నా. ఎందుకంటే నాకున్న నీటి వనరులు వరి పంటకు సరిపోవు. కేవలం అరుతడి పంటలను మాత్రమే నేను సాగు చేయగలను. రైతు బంధు కోసం అని అశపడి ప్రభుత్వం చెప్పిన పంటను వేస్తే పెట్టిన పెట్టుబడితో పాటు నష్టాలను చూడాల్సి ఉంటుంది.

అనాదిగా ఆరుతడి పంటలే : కృష్ణయ్య, రైతు

నాకున్న రెండెకరాల భూమిలో ఉన్న నీటిని అధారంగా చేసుకుని వరి పంటను సాగు చేస్తున్నాను. ఇప్పుడు ప్రభుత్వం నాకు అనుభవం లేని పంటలను వేయాలని సూచిస్తే వాటిని వేయడం వల్ల నేను నష్టపోతాను. ముఖ్యంగా పత్తి పంట వంటివి సూచిస్తే మాత్రం ప్రస్తుతమున్న పరిస్థితిలో కూలీల కొరత, కూలి రేట్లను నేను భరించలేను. నాకు రైతు బంధు కింద రూ.10వేలు ప్రభుత్వం ఇస్తుంది. ఆ డబ్బు కోసం నేను పత్తి వంటి వాణిజ్య పంట సాగు చేస్తే పెట్టుబడి పెద్ద ఎత్తున కావాల్సి వుంటుంది. కావున రైతు బంధుకు రైతులు వేసే పంటలు మూడి పెట్టడం
సరికాదు.


Next Story

Most Viewed