ధాన్యం కొనకపోతే ఆత్మహత్యలే.. చిన్నగూడూర్ రైతుల ఆవేదన

by  |
IKP centres
X

దిశ, చిన్నగూడూర్: రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్ళాల్లోనే మొలకెత్తుతోంది. ఈ వానాకాలం వాతావరణం అనుకూలంగా లేకపోయినా పంట దిగుబడులు క్రితం కన్నా తగ్గినా పెట్టుబడులకు, తిండికి సరిపోతాయని అనుకున్న రైతులకు అధికారుల అలసత్వం వల్ల నిరాశే మిగిలింది. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూర్ మండలంలో సుమారు 1500 వందల ఎకరాల్లో రైతులు వరిసాగు చేశారు. అయితే మొదట్నుంచీ అనుకూలించిన వాతావరణం, పంట కోసి కళ్లాల్లోకి తీసుకొచ్చాక కన్నీరు పెట్టిస్తోంది.

20 రోజులుగా అడపా దడపా వర్షాలు పడటంతో ధాన్యం తడిసి ఆరబెట్టడంతోనే రైతులకు సరిపోతోంది. వెంటనే ఐకేపీ కేంద్రాలు ప్రారంభించి ధాన్యం కొనుగోలు చేయాలని 15 రోజులుగా రైతులు వేడుకుంటున్న అధికారులు పట్టించుకోవడం లేదు. ఫలితంగా తుఫాను ప్రారంభమై రెండ్రోజుల నుంచి వర్షం పడుతుండటంతో మళ్లీ ధాన్యం తడిసి కళ్లాల్లోనే వడ్లు మొలకెత్తుతున్నాయని రైతులు వాపోతున్నారు. త్వరగా ఐకేపీ కేంద్రాలు ప్రారంభించి ధాన్యం కొనకపోతే ఆత్మహత్యలే శరణ్యం అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Next Story

Most Viewed