యువ కౌలు రైతు ప్రాణం తీసిన ‘గులాబ్’

by  |
యువ కౌలు రైతు ప్రాణం తీసిన ‘గులాబ్’
X

దిశ, నవీపేట్ : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. గులాబ్ తుఫాన్ కారణంగా పంట నీట మునగడంతో తీవ్ర నష్టం వాటిల్లి యువ కౌలు రైతు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ యాకుబ్, గ్రామస్తుల సమాచారం మేరకు నాలేశ్వర్‌కు చెందిన శ్రీనివాస్(32)కు ఎకరంన్నర పొలంతో ఉంది. దాంతో పాటు మరో 10 ఎకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేస్తున్నాడు. మొన్న వచ్చిన గులాబ్ తుఫాన్ కారణంగా గోదావరికి వరద పోటెత్తింది. దీంతో ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ పొలంలోకి చేరడంతో పంట మొత్తం నీటిలో మునిగిపోయింది.

పంట సాగు కోసం రూ.4 లక్షల అప్పు చేయడంతో అది ఎలా తీర్చాలో తెలీక మనస్తాపం చెంది భార్య ఇంట్లో లేని సమయంలో దూలానికి ఉరివేసుకొని శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. ఇంట్లోకి వచ్చిన భార్య జ్యోత్స్న వేలాడుతున్న భర్త మృతదేహాన్ని చూసి కేకలు వేయడంతో స్థానికులు వచ్చి రక్షించేలోపే యువ రైతు చనిపోయినట్టు తెలిసింది. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, పంచనామా అనంతరం డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం జిల్లా హాస్పిటల్‌కు తరలించినట్టు ప్రొబేషనల్ ఎస్ఐ ప్రేమ్ సాగర్ తెలిపారు.



Next Story