తుపాకితో బెదిరించి..పురుగుల మందు తాగించి

by  |

దిశ, సిరిసిల్ల: సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో దారుణం చోటుచేసుకుంది. భూ తగదాల కారణంగా సొంత అన్న కొడుకులే గన్‌తో బెదిరించి.. పురుగుల మందు తాగించి ఓ రైతును చంపేందుకు ప్రయత్నించారు. వివరాల్లోకివెళితే..ఇల్లంతకుంట మండలంలోని పెద్ద లింగాపూర్ గ్రామానికి చెందిన అబ్బుల రాములును అతని అన్న కొడుకులు ముగ్గురు బుధవారం గన్‌తో బెదిరించి, బలవంతంగా పురుగుల మందు తాగించారు. దీనంతటికి కారణం భూతగాదాలు అని తెలుస్తోంది. గత 25 ఏళ్లుగా రాములు సాగు చేసుకుంటున్న భూమిని కొత్తగా ఆ భూమి తమకు చెందుతుందని తన అన్న కొడుకులు గత కొన్ని రోజులుగా బెదిరిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ భూమి విషయం కోర్టులో నలుగుతున్నా, మోటార్ పెట్టేందుకని పొలం వద్దకు వెళ్ళిన రాములును అడ్డగించి అన్న కొడుకుతో పాటు మరో ఇద్దరు గన్ చూపించి, పురుగుల మందు తాగించారు. అది గమనించిన స్థానికులు బాధితుడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా ప్రాణాలతో బయటపడ్డాడు.ఈ విషయం తెలుసుకున్న పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు.

Next Story