పాసుబుక్ కోసం లంచం తీసుకుని.. వీఆర్వో టార్చర్ భరించలేక రైతు మృతి

by  |
పాసుబుక్ కోసం లంచం తీసుకుని.. వీఆర్వో టార్చర్ భరించలేక రైతు మృతి
X

దిశ, నారాయణపేట : రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా గోపాల్ నాయక్ అనే రైతు మనస్తాపంతో మృతి చెందాడని ఆరోపిస్తూ బాధిత కుటుంబీకులు నారాయణపేట జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద శనివారం సాయంత్రం రాస్తారోకో చేపట్టారు.ఈ ఘటనకు సంబంధించి బాధిత కుటుంబీకుల కథనం ప్రకారం.. నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలోని తిమ్మారెడ్డిపల్లి తండాకు చెందిన రైతు గోపాల్ నాయక్ (35) వ్యవసాయ పొలం రికార్డుల్లో తప్పుగా నమోదైంది. అయితే, తనకు చెందిన పొలం పేరిట పాస్‌బుక్ చేసి ఇవ్వాలని బాధిత వ్యక్తి వీఆర్వోను సంప్రదించాడు. అయితే, సదరు అధికారి పాస్ చేసేందుకు తన భర్త నుంచి డబ్బులు డిమాండ్ చేశాడని, దీంతో తన భర్త అప్పు చేసి ఎంతోకొంత ఆ అధికారికి ముట్ట జెప్పి పని కోసం ముంబై వెళ్లిపోయాడని తెలిపింది.

అయితే, ఇటీవలే తిరిగి వచ్చిన తన భర్త మళ్లీ వీఆర్వోను కలిసి తన పేరిట రాసి ఉన్న పొలం పాస్‌బుక్ ఇవ్వాలని కోరగా.. ఆ పొలం నీది కాదని, ప్రభుత్వానికి చెందినదని వీఆర్ఓ చెప్పడంతో మూడు రోజులుగా తీవ్ర మనస్తాపానికి గురై శుక్రవారం తన భర్త మృతి చెందాడని బాధిత భార్య తెలిపింది. అదేరోజు రాత్రి మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించగా, పోస్టుమార్టం అనంతరం శనివారం సాయంత్రం శవంతో బాధిత కుటుంబ సభ్యులతో పాటు, వామపక్ష నాయకులు స్థానిక పాతబస్టాండ్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంగానే రైతు గోపాల్ నాయక్ మృతి చెందారని, మృతుని కుటుంబానికి నష్టపరిహారం చెల్లించి, మృతుడి భార్యను ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు రాస్తారోకో కొనసాగుతూనే ఉంది. పోలీసులు రాస్తారోకో విరమించాలని కోరినా బాధిత కుటుంబీకులు, వామపక్ష నాయకులు రాత్రి వరకు ఆందోళనను కొనసాగించారు. కాగా, మృతునికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు.


Next Story

Most Viewed