నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి.. ధాన్యం రాశులపైనే కుప్పకూలిన అన్నదాత!

by  |
నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి.. ధాన్యం రాశులపైనే కుప్పకూలిన అన్నదాత!
X

దిశ, జమ్మికుంట : ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోవడానికి మార్కెట్‌కు వచ్చిన రైతు 15 రోజులు గడుస్తున్నా వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేపట్టకపోవడంతో ధాన్యం రాశులపైనే అన్నదాత తుదిశ్వాస విడిచాడు. ఈ ఘటన జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. పట్టణ పరిధిలోని ఆబాది జమ్మికుంటకు చెందిన బిట్ల ఐలయ్య అలియాస్ అయిలే‌శ్‌కు 15 గుంటల వ్యవసాయ భూమి ఉంది. అందులో పండించిన వరి ధాన్యాన్ని అమ్ముకునేందుకు మార్కెట్‌లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు (ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం) కేంద్రానికి తీసుకు వచ్చాడు.

వరి ధాన్యం తేమగా ఉండటంతో అధికారులు కొనుగోలు చేపట్టలేదు. ఈ క్రమంలో ఇవాళ ఐలయ్య తన ఇంటికి వెళ్లి భోజనం చేసిన అనంతరం తిరిగి మార్కెట్‌కు చేరుకున్నాడు. ధాన్యం అమ్ముడు పోతుందో లేదో అని దిగాలుగా ఉన్న అన్నదాతకు ఒక్కసారిగా గుండె నొప్పి రావడంతో ధాన్యం రాశులపైనే కుప్పకూలిపోయి తుది శ్వాస విడిచాడు. కుటుంబ సభ్యులు ఐలయ్య మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, రెవెన్యూ, పోలీసు అధికారులు ఆస్పత్రికి చేరుకుని మృతుడి వివరాలు సేకరించారు. మృతునికి భార్య లక్ష్మితో పాటు ఒక్కగానొక్క కూతురు నిత్య కూడా ఉంది. కుటుంబ సభ్యుల రోదనలతో ప్రభుత్వ ఆసుపత్రి దద్దరిల్లిపోయింది.

Next Story