భూ తగాదాల్లో రైతు ఆత్మహత్యాయత్నం

by  |
భూ తగాదాల్లో రైతు ఆత్మహత్యాయత్నం
X

దిశ, చిట్యాల: భూ తగాదాల విషయంలో ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం శాంతినగర్ గ్రామ శివారులో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన సింగిశాల మోహన్ రావుకు నవాబుపేట గ్రామ శివారులో కొంత వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమిపై గత కొంతకాలంగా చింతకుంట రామయ్య పల్లి గ్రామానికి చెందిన మొకిరాల సుధాకర్ రావుకు భూ తగాదా నడుస్తోంది. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లలో పలుమార్లు కేసులు పెట్టుకున్నారు. ఈ భూమిపై కోర్టులో సైతం కేసు నడుస్తోంది. గురువారం భూ తగాదాల విషయంపై బాధితుడు మోహన్ రావు ను పోలీస్ స్టేషన్ కు ఎస్ఐ పిలిచినట్లు తెలిసింది.

ఇట్టి భూమిలో సాగు చేసుకోవచ్చని ఎస్ఐ ట్రాక్టర్ యజమాని అయిన బొంకూరి రాజయ్యకు తెలపడంతో భూమిలోకి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అక్కడే ఉన్న రైతు మోహన్ రావు ఎలా భూమిని చదును చేస్తారంటూ అంతకు ముందు ఓ లేఖ రాసుకుని ఆ వ్యవసాయ భూమిలోనే గడ్డి మందు తాగి ఆత్మహత్నాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన ట్రాక్టర్ డ్రైవర్ జెట్టి రమేష్ హుటాహుటిన చిట్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ప్రథమ చికిత్స అనంతరం వైద్యులు ఎంజీఎం ఆస్పత్రికి రిఫర్ చేశారు. మోహన్ రావు రాసుకున్న లేఖలో తన ఆత్మహత్యాయత్నానికి కారణం చిట్యాల ఎస్సై అని పేర్కొన్నాడు.

గత వారం రోజుల నుంచి ఎస్ఐ భూ తగాదా విషయంలో ఇబ్బందులకు గురి చేశాడని, అందుకే చనిపోతున్నానని భార్య, పిల్లలకు న్యాయం చేయాలని ఆ లేఖలో పేర్కొన్నాడు. దీనిపై చిట్యాల ఎస్ఐ ఇమ్మడి వీరభద్రరావును వివరణ కోరగా.. ఈ భూమిపై గత కొంత కాలంగా కోర్టులో వివాదం నడుస్తుందని తెలిపారు. ఇద్దరిపై కేసులు సైతం నమోదు అయ్యాయని, ఈ ఆత్మహత్యాయత్నానికి తమకు ఎలాంటి సంబంధం లేదని “దిశ”కు వివరించారు.

Next Story