వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేయండి.. డీజీపీకి చంద్రబాబు లేఖ

by  |
TDP Politburo Meeting
X

దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా మహేశ్వరరావుపై వైసీపీ నేతలు దాడికి పాల్పడటాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. వైసీపీ నేతల అవినీతి అక్రమాలను అడ్డుకుంటే దాడులు చేస్తారా? అని నిలదీశారు. ఉమా మహేశ్వరరావుపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌కు చంద్రబాబు లేఖ రాశారు. తక్షణమే దాడి చేసిన వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేయాలని లేఖలో కోరారు. ఇకపోతే కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం జి. కొండూరు మండలం గడ్డ మణుగ గ్రామం పారెస్ట్‌లో వైసీపీ నేతల అక్రమ మైనింగ్‌ని వెలికితీసేందుకు వెళ్లిన దేవినేని ఉమామహేశ్వరరావు కారుపై వైసీపీ గూండాలు దాడి చేయడంపై చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ నేతలు ప్రజా సంపదను దోచుకుంటుంటే ప్రజల తరపున టీడీపీ నేతలు అడ్డుకోవడం తప్పా? అని ప్రశ్నించారు. వైసీపీ నేతల అవినీతిని అడ్డుకుంటే దాడులు, మైనింగ్‌ని అడ్డుకుంటే హత్యయత్నాలు, బెదిరింపులకు పాల్పడుతారా? అంటూ ధ్వజమెత్తారు. ఒక్కరిపై 100 మంది వైసీపీ గూండాల దాడి పిరికిపింద చర్య అని వ్యాఖ్యానించారు.

స్ధానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ప్రోత్సాహంతోనే ఈ దాడి జరిగిందన్నారు. ఈ ఘటనలో నిందితులపై హత్యయత్నం కేసులు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. జగన్ రెడ్డి చేతకాని పాలనతో భవిష్యత్‌లో మళ్లీ వైసీపీ అధికారంలోకి రాదని వైసీపీ నేతలు, కార్యకర్తలకు ఇప్పటికే అర్థమైపోయిందని అందుకే అందినకాడికి దోచుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో వైసీపీ నేతలు చెరువులు, గుట్టలు, చివరకు శ్మశానాలకు కూడా వదలకుండా దోచుకుంటున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రజా సందపను కాపాడాల్సిన ప్రజా ప్రతినిధులే ప్రజల సంపదను దోచేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. అధికార మదంతో రాష్ట్రంలో వైసీపీ నేతల అవినీతి, అరాచాకాలు పెరిగిపోయాయి.

ముందురోజుల్లో వైసీపీ నేతలు చేసిన అవినీతికి, అరాచకాలకు చక్ర వడ్డీతో సహా మూల్యం చెల్లించకతప్పదని చంద్రబాబు హెచ్చరించారు. అంతకు ముందు చంద్రబాబు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వర రావు, కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు చంద్రబాబుకు స్వాగతం పలికారు. చంద్రబాబు ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయటకు రాగానే కార్యకర్తలు జై బాబు.. జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. అనంతరం పార్టీ ముఖ్య నాయకులు చంద్రబాబుతో కొద్దిసేపు మాట్లాడారు. అనంతరం చంద్రబాబు రోడ్డు మార్గంలో గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసానికి వెళ్లారు.



Next Story