కుల్దీప్‌కు దక్కని చోటు.. కోహ్లీపై విమర్శలు

by  |
కుల్దీప్‌కు దక్కని చోటు.. కోహ్లీపై విమర్శలు
X

దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ గత కొన్ని మ్యాచ్‌లుగా బెంచ్‌కే పరిమితం అయ్యాడు. ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన కుల్దీప్ ఒక్క టెస్టు కూడా ఆడలేదు. రవీంద్ర జడేజా గాయపడినా కుల్దీప్‌కు మాత్రం చోటు దక్కలేదు. ఇంగ్లాండ్ సిరీస్‌కు కూడా కుల్దీప్ ఎంపిక కావడంతో స్వదేశంలో అయినా చాన్స్ ఇస్తారని అందరూ భావించారు. కానీ, చెన్నై టెస్టులో కూడా ఈ చైనామన్ బౌలర్‌ను పక్కన పెట్టారు. దీంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రిపై క్రీడాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్షర్ పటేల్ గాయంతో తప్పుకోవడంతో షాబాజ్ నదీమ్‌కు ఛాన్స్ ఇచ్చారు.

కానీ కుల్దీప్‌ను మాత్రం పట్టించుకోలేదు. రవిచంద్రన్ అశ్విన్‌కు తోడుగా జూనియర్లు అయిన వాషింగ్టన్ సుందర్, షాబాజ్ నదీమ్‌లను తీసుకొని కుల్దీప్‌ను ఎందుకు పక్కన పెట్టారని పలువురు విమర్శిస్తున్నారు. కుల్దీప్ యాదవ్ చివరి సారిగా 2019లో సిడ్నీలో టెస్టు మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్ డ్రా అయినా కుల్దీప్ ఒకే ఇన్నింగ్స్‌లో 5 వికెట్లతో సత్తా చాటాడు. ఆ తర్వాత కుల్దీప్‌కు టెస్టుల్లో అవకాశమే రాలేదు. నెట్ బౌలర్లు, రిజర్వ్ బౌలర్లకు అవకాశాలు వస్తున్నా కుల్దీప్‌ను పక్కన పెట్టడంపై మాజీ క్రికెటర్లు కూడా తప్పుబడుతున్నారు. మహ్మద్ కైఫ్, ఆర్పీ సింగ్ వంటి వాళ్లు కుల్దీప్‌కు ధైర్యం చెప్పారు.

Next Story

Most Viewed