ప్రముఖ రచయిత కొత్త శివమూర్తి కన్నుమూత..

by  |
ప్రముఖ రచయిత కొత్త శివమూర్తి కన్నుమూత..
X

దిశ, ఏపీ బ్యూరో: ప్రముఖ రచయిత కొత్త శివమూర్తి (88) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం రాజమహేంద్రవరంలోని ప్రభుత్వాస్పత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. శివమూర్తికి భార్య రాజేశ్వరి, కుమార్తె స్వర్ణలత ఉన్నారు. దోపిడీ కులవ్యవస్థ, జన్మరహస్య వ్యూహాలను విశ్లేషిస్తూ తెలుగులో అనేక రచనలు చేసిన పరిశోధకుడు, విప్లవ వాది కొత్త శివమూర్తి. గుంటూరు జిల్లా సంగం సమీపంలోని జాగర్లమూడిలో కొత్త పుష్పమ్మ, కొత్త నరసయ్య దంపతులకు జన్మించారు. సమాజంలోని దోపిడీ, కులవ్యవస్థలపై రచనలు చేశారు. అయితే 13 ఏళ్లుగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలోని కడింయలో భార్యతో కలిసి నివసిస్తున్నారు.

కొత్త శివమూర్తి రచించిన బ్రహ్మణిజం జన్మరహస్యం పుస్తకం చాలా ప్రాచుర్యం పొందింది. నాగజాతి, అంతర్జాతీయ ఆర్యుల గుట్టు, వేదభూమి కాదు ఇది నాగభూమి, అవతారాలగుట్టు ఆర్యజాతి చరిత్ర, ఆర్య చాణక్యుడు, పుష్యమిత్రుడు వంటి రచనలు చేశారు. ఇటీవలే బ్రహ్మ మిథ్య-జగత్ సత్యం అనే పుస్తకాన్ని రచించారు. కొత్త శివమూర్తి మరణం తెలుగు సమాజానికి తీరని లోటని పలువురు రచయితలు, కవులు, మేధావులు అభిప్రాయపడుతున్నారు. తన రచనల ద్వారా సమాజంలోని దోపిడీ కులవ్యవస్థను రూపుమాపడంలో కీలక పాత్ర పోషించారని ప్రముఖులు కొనియాడారు. ఈ సందర్భంగా కొత్త శివమూర్తి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.


Next Story

Most Viewed