కలెక్టరేట్‌ ఎదుట ఫ్యామిలీ సూసైడ్ అటెంప్ట్.. ఎందుకో తెలుసా..?

by  |
కలెక్టరేట్‌ ఎదుట ఫ్యామిలీ సూసైడ్ అటెంప్ట్.. ఎందుకో తెలుసా..?
X

దిశ, నాగర్‌కర్నూల్: ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి చావుకు మీరే కారణమని బెదిరించి.. తమ పొలాన్ని స్వాధీనం చేసుకోవాలని పలువురు కుట్ర చేశారని ఆరోపిస్తూ బాధిత కుటుంబ సభ్యులు పురుగుల మందు తాగేశారు. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ ఆఫీసులో కలకలం రేపింది.

ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే.. తెలకపల్లి మండలం జమిస్తాపూర్ గ్రామానికి చెందిన కాకునూరు రాజు, తమ్ముడు నరేష్‌ల సొంత గ్రామం బిజినేపల్లి. కానీ, అమ్మమ్మగారి గ్రామం జమిస్తాపూర్‌కు చాలా కాలం క్రితం వచ్చి స్థిరపడ్డారు. ఇదే గ్రామంలో సర్వే నెంబర్ 100, 102లో వీరికి రెండు ఎకరాల భూమి కూడా ఉన్నది.

కాగా, గత నెల 26న వారి బంధువు కొండలు అనే వ్యక్తి అక్రమ సంబంధం వ్యవహారంలో పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ వ్యక్తి మరణానికి కారణం మీరేనని ముగ్గురు పెద్దమనుషులు గ్రామంలో బంధించి రూ. 7 లక్షల జరిమానా విధించారని, బలవంతంగా కాగితాలపై సంతకాలు కూడా చేయించుకున్నారని ఆరోపించాడు కాకునూరు రాజు. జరిమానా కట్టకపోతే ఒక ఎకరం పొలం రాసి ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశాడు.

దీంతో మనస్థాపం చెంది భార్యా పిల్లలతో పాటు కలెక్టరేట్ ఆఫీసులో పురుగుల మందు సేవించి సామూహిక ఆత్మహత్యకు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది వారిని అంబులెన్స్‌లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు ధృవీకరించారు. బెదిరింపులకు పాల్పడిన ముగ్గురు పెద్దమనుషుల్లో ఒకరు గ్రామ సర్పంచ్ శ్రీధర్ రెడ్డి, గ్రామస్తుడు శేఖర్ రెడ్డి , మరొకరు స్థానిక ఎస్సై మాధవ రెడ్డి మామ మన్యం రెడ్డి ఉండటం గమనార్హం.

నా ప్రమేయం ఉందని తేలితే స్వచ్ఛంద విరమణ చేస్తా..

బాధితుల భూమిని నేను గాని, మా మామ గాని కొనేందుకు ప్రయత్నించినట్లు తేలితే స్వచ్ఛంద విరమణ ప్రకటించుకుంటా. బాధితులకు ఎస్సై మాధవ రెడ్డి తెలుసా.. ఎప్పుడైనా చూశారా.? కొండలు మృతి చెందడానికి కారణం కాకునూరు రాజు వారి బంధువులేనని మా విచారణలో తేలింది. -ఎస్సై మాధవ రెడ్డి

న్యాయం చేస్తాం..

న్యాయం కోసం కలెక్టర్ కార్యాలయం ముందు ఆత్మహత్య యత్నం చేసిన కుటుంబానికి విచారణ జరిపి న్యాయం చేస్తాం. -మోహన్ రెడ్డి, డీఎస్పీ నాగర్ కర్నూల్


Next Story