వరవరరావు ఆరోగ్య చికిత్సపై వైద్య నివేదిక ఇవ్వాలి

by  |
వరవరరావు ఆరోగ్య చికిత్సపై వైద్య నివేదిక ఇవ్వాలి
X

దిశ, న్యూస్‌బ్యూరో: భీమా-కోరేగావ్‌ కేసుపై అరెస్టయ్యి జైల్లో ఉన్న వరవరరావు ఆరోగ్య పరిస్థితులపై వైద్య నివేదికలు తమకు అందుబాటులో ఉంచాలని కుటుంబ సభ్యులు కేంద్ర, మహారాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. వరవరరావు భార్య హేమలత, కుమార్తెలు సహజ, అనల, పవన ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేశారు. జైల్లో ఉన్న వ్యక్తి ఆరోగ్యస్థితి గురించి కుటుంబ సభ్యులకు తెలియజేయకపోవడం చట్టవ్యతిరేక చర్యలని పేర్కొన్నారు. గతవారం రోజులలో ఆయనను తలోజా జైలు నుంచి జేజే ఆసుత్రికి, సేంట్ జార్జి ఆసుపత్రికి, నానావతి ఆసుపత్రికి తరలించగా కొవిడ్ పాజిటివ్ వచ్చిందన్న సమాచారం తప్ప మరో విషయం తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జేజే ఆసుత్రి నుంచి సెయింట్ జార్జి ఆసుపత్రికి తరలించిన తర్వాతనే ఆయనకు కరోనా సోకిందన్న విషయం తెలిసిందని, నిర్ధారణ చేసుకోడానికి జైలు అధికారులకు ఫోన్ చేసినప్పుడు వారు ధృవీకరించారని పేర్కొన్నారు.

వరవరరావు ఆరోగ్య స్థితి క్షీణిస్తోందని, నానావతి ఆస్పత్రిలో వైద్యులు ఆయన తలకు గాయమైందని, కుట్లు పడ్డాయని లాంటి వార్తలన్నీ వివిధ మార్గాల ద్వారా వస్తున్నాయని, ఇవి తమను ఆందోళనకు గురిచేస్తున్నాయని తెలిపారు. ఆరోగ్య పరిస్థితులపై ఎప్పటికప్పుడు అధికారిక, పారదర్శక సమాచారం అందుకోవడం కుటుంబానికి ఉన్న హక్కు అయినా సంబంధిత పోలీసు, జైలు, ఆసుపత్రి అధికారులు ఆ బాధ్యత నిర్వర్తించడంలో నిర్లక్ష్యంగా ఉన్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

‘ఆసుపత్రిలో ఉన్న వరవరరావు‌కు సహకరించడానికి కుటుంబ సభ్యుల్లో ఒకరిని అనుమతించాలి. ఆరోగ్య పరిస్థితి వైద్యసరళిపై రోజుకు రెండు సార్లు తాజా సమాచారాన్ని పారదర్శకంగా అధికారికంగా అందజేయాలి. జైలు, ఆస్పత్రి అధికారులను సంబంధిత అధికారులు తక్షణమే ఆదేశించాలి. కుటుంబ సభ్యులు సమాచారం తెలుసుకోవడానికి వీలుగా ఆస్పత్రిలో ఎవరిని సంప్రదించాలో స్పష్టమైన సమాచారం ఇవ్వాలి. సాధారణ బెయిల్ లేదా కొవిడ్ నేపథ్యంలో మధ్యంతర బెయిల్ గానీ ఇవ్వడానికి వీలుగా న్యాయప్రక్రియలో ఉన్న అడ్డంకులను తొలగించాలి’ అని కుటుంబ సభ్యులు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

Next Story

Most Viewed