సంగారెడ్డిలో విషాదం.. ఆర్ధిక ఇబ్బందులతో కుటుంబం ఆత్మహత్య

by  |
family-suicide1
X

దిశ, ఆందోల్: ఆర్థిక ఇబ్బందులతో సంగారెడ్డి జిల్లాలో ఓ కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. అప్పుల బాధ…ఇంట్లోని గొడ‌వల కార‌ణంగా భ‌ర్త ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకోగా, భార్య- ఇద్దరు పిల్లలు చెరువులో ప‌డి అత్మహ‌త్యకు పాల్పడిన హృద‌య‌విదార‌క‌ర‌మైన సంఘ‌ట‌న సంగారెడ్డి జిల్లాలో రామ‌చంద్రపూర్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివ‌రాలు ఈ విధంగా ఉన్నాయి.. రామచంద్రాపురంలోని ఎంఐజీ కాలనీకి చెందిన చంద్రకాంత్ కు కామారెడ్డి జిల్లా చిట్యాల‌కు చెందిన లావ‌ణ్యతో గ‌త ప‌దేళ్ల క్రితం వివాహం జ‌రిగింది. వీరికి కొడుకు ప్రీత‌మ్‌, కూతురు స‌ర్వజ్ఞలు ఉన్నారు.

చంద్రకాంత్ టీసీఎస్ (టాటా క‌న్సల్టెన్సీ కంపెనీ) లో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తూ తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. బీహెచ్ఈఎల్‌లో నూత‌నంగా ఇల్లును కొనుగోలు చేసేందుకు చంద్రకాంత్‌ అప్పు చేయాల్సి వచ్చింది. తీసుకున్న ఆ అప్పును తీర్చేందుకు వారి స్వగ్రామ‌మైన జ‌హీరాబాద్ మండ‌లం అల్లాపూర్‌లో ఉన్నభూమిలో త‌న వాటా కింద 2 ఎక‌రాల భూమిని విక్రయిద్దామ‌ని త‌న తండ్రి నాగేశ్వర‌రావుతో చెప్పగా, అయ‌న దానికి ఒప్పుకోక‌పోవ‌డంతో గ‌తేడాది నుంచి త‌రుచూ గొడ‌వ జ‌రిగేది. అప్పుల బాధ ఎక్కువ కావ‌డంతో అల్లుడి బాధ చూడ‌లేక లావ‌ణ్య తండ్రి రాజేంద్రప్రసాద్ రూ.35 ల‌క్షల అర్థిక స‌హ‌యం చేశాడు. అయిన‌ప్పటికీ అప్పులు తీర‌క‌పోవ‌డంతో గురువారం సాయంత్రం తండ్రి, కొడుకుల మ‌ధ్య ఇంట్లో గొడ‌వ జ‌రుగగా, విసుగు చెందిన చంద్రకాంత్ (35) తాను చ‌నిపోతాన‌ని చెప్తూ గ‌దిలోకి వెళ్లి డోర్ వేసుకోగా, లావ‌ణ్య త‌న ఇద్దరి పిల్లల్ని తీసుకుని ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. ప‌టాన్ చెరు బ‌స్టాండ్ వ‌ద్దకు వ‌చ్చి వేరే వారి ఫోన్ తో ఇంటికి ఫోన్ చేసి, చంద్రకాంత్ గూర్చి ఆరా తీయ‌గా, అత‌ను ఊరివేసుకుని చ‌నిపోయిన‌ట్లు చెప్పారు. తాను కూడా బ‌త‌క‌డం వ్యర్థమేన‌ని భావించి ఆమె ఇంటికి వెళ్లకుండా బ‌స్సెక్కి అందోల్ కు చేరుకుంది. త‌న‌ ఇద్దరు పిల్లలతో ఆమె పెద్ద చెరువులో దూకిన‌ట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం చెరువులో మృతదేహాలు తేలడంతో, అటువైపుగా వెళ్లిన వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

అత్మహ‌త్యల‌కు మృతుని తండ్రే కార‌ణం?

అప్పుల బాధ‌తో అత్మహ‌త్య చేసుకోవ‌డానికి చంద్రకాంత్ తండ్రి నాగేశ్వర‌రావు కార‌ణ‌మ‌ని మృతుడి, మృతురాలు లావ‌ణ్య బంధువులు ఆరోపిస్తున్నారు. నాగేశ్వర‌రావుకు ఇద్దరు కూమారులు కాగా, పెద్ద కొడుకు అమెరికాలో స్థిర‌ప‌డగా, చిన్న కొడుకు టీసీఎస్‌లో స్టాప్ వేర్ ఉద్యోగిగా ప‌నిచేస్తున్నాడు. నాగేశ్వరావు రిటైర్డ్ బీహెచ్ ఈఎల్ ఉద్యోగి కావ‌డంతో రామ‌చంద్రపురంలో స్థిర‌ప‌డ్డారు. వారి స్వగ్రామం అల్లాపూర్‌లో 8 ఎక‌రాల వ‌ర‌కు భూమి ఉండ‌గా, అందులో నుంచి త‌న వాటా కింద 2 ఎక‌రాల‌ను అమ్ముదామ‌ని, గ‌త కొంత‌కాలం నుంచి అడుగుతుండ‌గా వీరివురి మ‌ధ్య గొడ‌వ‌లు సాగుతున్నాయి. త‌న‌కు అప్పు ఉంద‌న్న విష‌యాన్ని కూడా అమెరికాలో స్థిర ప‌డిన విఠ‌ల్‌రావుకు వివ‌రించాడ‌ని, ఆయ‌న కూడా త‌న తండ్రికి ఫోన్ చేసి త‌మ్ముడు చెప్పిన‌ట్లుగా చేయ‌మ‌ని, త‌న‌కేమీ అభ్యంత‌రం లేద‌ని చెప్పినా, ఎవ‌రి మాటాల‌ను నాగేశ్వరరావు ప‌ట్టించుకోక‌పోవ‌డంతోనే చంద్రకాంత్‌, అత‌ని భార్య, ఇద్దరు పిల్లలు అత్మహ‌త్య చేసుకునే ప‌రిస్థితికి దారి తీసింద‌ని లావ‌ణ్య బంధువులు ఆరోపిస్తున్నారు.

అచూకీ కోసం రాత్రంతా ఆరా

చంద్రకాంత్ మృతి చెందాడన్న విష‌యం తెలుసుకున్న లావ‌ణ్య త‌న ఇద్దరి పిల్లల‌తో క‌లిసి ఇంట్లో నుంచి వెళ్లిపోవ‌డంతో ఆమె అచూకీ కోసం లింగంప‌ల్లి పోలీస్ స్టేష‌న్‌లో గురువారం సాయంత్రం ఫిర్యాదు చేయ‌గా, మిస్సింగ్ కేసుగా పోలీసులు న‌మోదు చేశారు. ఆమె ప‌టాన్ చెరు నుంచి ఫోన్ చేసిన‌ట్లు ఆధారాలుండ‌డంతో, అటువైపుగా సంగారెడ్డి వ‌ర‌కు బంధువులు, పోలీసులు రాత్రంతా వెతికినా ఎక్కడా ఆమె అచూకీ ల‌భించ‌లేదు. అందోల్ పెద్ద చెరువులో శుక్రవారం ఉద‌యం మృత‌దేహాలు ల‌భ్యం కావ‌డంతో, ఆమె బంధువుల‌కు పోలీసులు స‌మాచారాన్ని అందించారు.



Next Story

Most Viewed