పూజల పేరుతో లక్షలు స్వాహా.. దొంగబాబా అరెస్టు

by  |
పూజల పేరుతో లక్షలు స్వాహా.. దొంగబాబా అరెస్టు
X

దిశ, కరీంనగర్ సిటీ : దేవుని పేరుతో మాయమాటలు చెప్పి అమాయకుల నుంచి లక్షలు వసూలు చేస్తున్న దొంగబాబాను కరీంనగర్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. జిల్లాలోని దుర్శేడ్ గ్రామానికి చెందిన గంధం రమేష్ అనే బుడిగజంగం కులానికి చెందిన వ్యక్తి పూజలు చేస్తా.. ఆరోగ్య సమస్యలు తీరుస్తా.. కుటుంబ సమస్యలకు పరిష్కారం చూపుతానంటూ అమాయక ప్రజలకు మాయమాటలు చెప్పి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాడు.నగరంలోని ఎస్బీఐ బ్యాంకులో పరిచయమైన ఒక సెక్యూరిటీ గార్డుకు ఉన్న సమస్యలు గుర్తించిన దొంగబాబా.. పూజలు చేసి సమస్యలు పరిష్కరిస్తానని చెప్పడంతో సెక్యూరిటీ అతని మాటలు నమ్మాడు.

పరిష్కారానికి చాలా పూజలు చేయాల్సి ఉంటుందని, వేరు వేరు ప్రదేశాలకు వెళ్ళి పూజలు, హోమం చేయాల్సి ఉంటుందని చెప్పి అతని నుండి భారీగా డబ్బులు గుంజాడు. పలు దఫాలుగా అతని నుంచి రూ. 2,00,116 తీసుకుని తప్పించుకు తిరుగుతుండటంతో మోస పోయినట్లు గుర్తించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు రూరల్ పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతుండగా, మరింత మంది అతని దగ్గర మోసపోయినట్లు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో మంగళవారం టాస్క్ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగి అతన్ని పట్టుకున్నారు. అనంతరం స్టేషన్‌కు తరలించినట్లు రూరల్ సీఐ విజ్ఞానరావు తెలిపారు.



Next Story

Most Viewed