రూ.100 కోట్ల ఆదాయం వస్తేనే కొత్త బార్లకు లాటరీ?

by  |
రూ.100 కోట్ల ఆదాయం వస్తేనే కొత్త బార్లకు లాటరీ?
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వం అప్పనంగా వచ్చే ఆదాయంపై దృష్టి పెట్టింది. కొత్త బార్ల దరఖాస్తుల నుంచే రూ. 100 కోట్లు సాధించాలనే కోణంలో దరఖాస్తు గడువును పొడిగించింది. ఇప్పటికే రూ. 75 కోట్లను దరఖాస్తు కొనుగోళ్ల నుంచి రాబట్టుకున్న ప్రభుత్వం… మరో రూ. 25 కోట్లు వస్తేనే లాటరీ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అయితే నిజామాబాద్​, బోధన్​ వంటి ప్రాంతాల్లో రాజకీయ నేతల సిండికేట్​ వ్యవహారంతోనే బార్లకు దరఖాస్తు గడువు పెంచినట్లు కూడా ప్రచారం జరుగుతోంది.

రాష్ట్రంలో 72 మున్సిపాలిటీల పరిధిలో 159 కొత్త బార్ల ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటికి గత నెల 25 నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. దరఖాస్తు గడువు మంగళవారంతో ముగియనుండగా ఈ నెల 16 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దరఖాస్తుల ప్రక్రియ పూర్తయిన అనంతరం లాటరీ విధానంలో అధికారులు లైసెన్స్‌దారులను ఎంపిక చేయనున్నారు. ఈ నెల 18న పురపాలక సంఘాల పరిధిలో, 19న జీహెచ్‌ఎంసీ పరిధిలో లాటరీ విధానంలో లైసెన్స్‌దారులను ఎంపిక చేస్తామని అధికారులు పేర్కొన్నారు. ముందు షెడ్యూల్​ ప్రకారం బుధవారం మున్సిపాలిటీలో, గురువారం జీహెచ్​ఎంసీలో లాటరీ నిర్వహించాల్సి ఉంది.

అయితే ప్రభుత్వం కొత్త బార్లకు దరఖాస్తు గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఫెనాల్టీతో ఈ నెల 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. దరఖాస్తు కోసం రూ. లక్ష చొప్పున రుసుం ఉంటోంది. లక్ష చెల్లించి దరఖాస్తు తీసుకుని దాఖలు చేయాల్సి ఉంటోంది. సోమవారం రాత్రి వరకు 7,360 దరఖాస్తులు రాగా… రూ. 73.60 కోట్లు దరఖాస్తులతోనే వసూలయ్యాయి. దీన్ని రూ. 100 కోట్లకు పెంచుకోవాలని లక్ష్యంతోనే గడువు పెంచినట్లు భావిస్తున్నారు.
అంతేకాకుండా కొన్నిచోట్ల రాజకీయ నేతలు జోక్యం చేసుకుని సిండికేట్​గా మార్చారనే ఆరోపణలున్నాయి. పలు ప్రాంతాల్లో తక్కువ దరఖాస్తులు రాగా… మరికొన్ని చోట్ల సిండికేట్​ వ్యాపారులే దరఖాస్తు చేసినట్లు అనుమానాలున్నాయి. దీనిపై ఆరోపణలు కూడా వచ్చాయి. దీంతో తక్కువ వచ్చిన ప్రాంతాల్లో ఈ ఆరోపణలకు తావు లేకుండా గడువు పెంచారని ప్రచారం జరుగుతోంది.


Next Story

Most Viewed