ఖర్చులు మోపెడు.. వరిగడ్డి పిడికెడు..

by  |
ఖర్చులు మోపెడు.. వరిగడ్డి పిడికెడు..
X

దిశ, నల్లగొండ: టెక్నాలజీతో వ్యవసాయ రైతులకు రిలీఫ్ దొరుకుతున్నా అదే స్థాయిలో తిప్పలు తప్పడం లేదు. నాటు పెట్టే దగ్గర నుంచి వరికోత వరకు యంత్రాలు హెల్ప్ చేస్తున్నా రైతు పూర్తిస్థాయిలో సాటీస్పై కాలేకపోతున్నాడు. ప్రస్తుతం మిషన్‌ల ద్వారా గంటల్లోపేనే వడ్లు చేతికి వస్తున్నా.. పశువులకు వేసే గడ్డిని తీసే క్రమంలో మాత్రం రిస్క్ పడుతున్నాడు. పంట తీసే టైంలో మిషన్లు గడ్డిని చిందరవందరగా వేయడంతో అది దగ్గరకు పేర్చి, కట్టలు కట్టి ఇంటికి తరలించేందుకు ఇబ్బంది పడుతున్నాడు. దీనికి ముగ్గురు నలుగురు కూలొళ్లు.. మళ్లీ వాటిని కట్టలు కట్టే మిషన్‌, ట్రాక్టర్ కిరాయిలను చెల్లిస్తున్నాడు. ఇంత చేసినా అనుకున్న రీతిలో గడ్డి చేతికందక పోవడంతో రైతు పరిస్థితి ఖర్చులు మోపెడు.. వరిగడ్డి పిరికెడు అన్నచందంగా తయారైంది.

గతంలో పంటకోస్తే వడ్లు చేతికొచ్చేందుకు ఐదారు రోజులు పట్టేది. ఫస్ట్‌రోజు వరికోయడం, తర్వాత మెద పెట్టడం, తెల్లారి పడుగు తొక్కించడం, వడ్లు పట్టడం.. ఆరబోయడం చేసేవారు. ఈ ప్రక్రియ ముగిసే సరికి ఐదారు రోజుల టైం పట్టేది. ఇంతలో వర్షం పడితే అంతే సంగతులు. అప్పటితో పోల్చుకొని వరిగడ్డి విషయాన్ని పక్కన పెడితే వడ్లు తొందరగా చేతికి అందడం అయితే యంత్రాలు బాగానే ఉపయోగపడుతున్నాయనే చెప్పొచ్చు. కానీ వరికోత యంత్రాలతో పంటలను కోయడం వల్ల వరిగడ్డి దిగుబడి తగ్గిపోయి.. మూగజీవాలకు సరిగ్గా గ్రాసం దొరక్కా, బక్కచిక్కిపోతున్న పరిస్థితులు కనపడుతున్నాయి. దీనికితోడు మిషన్ల ద్వారా కోసిన వరిగడ్డి తినేందుకు పశువులు అంతగా ఇష్టపడకపోవడం ఓ కారణం.

రైతుకు భారంగా రవాణా ఖర్చులు..

ట్రాక్టర్ గడ్డిని పొలాల నుంచి ఇంటికి తరలించేందుకు రూ.7వేల వరకు ఖర్చవుతుంది. ఎకరం గడ్డిని ఒకచోటికి చేర్చడానికి ముగ్గురు కూలీలు అవసరం. వారికి ఎటూ లేదన్న రూ.500చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది. ఇదే క్రమంలో గడ్డిని మోపులు చుట్టే మిషన్‌కు ఎకరానికి రూ.వెయ్యి ఇవ్వాలి. గడ్డి మోపులను ట్రాక్టర్ల ద్వారా ఇంటికి తరలించేందుకు రూ.వెయ్యి నుంచి రూ.1500 ట్రాక్టర్‌కు కిరాయి అవుతోంది. ఇంటి దగ్గర దించేందుకు ఆరుగురు కూలీలు అవసరం అవుతారు. ఒక్కొక్కరికి రూ.600 వరకు చెల్లించాల్సి ఉంటుంది. (ఆరుగురికి కలిపి రూ.3600 అవుతుంది). గుడ్ విల్(దావత్) కింద మరో రూ.500 ఇస్తారు. మొత్తంగా ఒక్క ట్రాక్టర్ గడ్డిని పొలం నుంచి ఇంటికి చేర్చేందుకు రూ.7వేలు ఖర్చు చేయాలి. ఈ గడ్డి రెండు మూడ జతల ఎడ్లకు మూన్నెళ్ల వరకే వస్తుంది. అటు ఏటికేడు మిషన్ల ద్వారా పంట కోస్తుండటంతో మనుషులు(కూలోళ్లు) కోసే గడ్డికి డిమాండ్ ఏర్పడింది. మనుషులు కోసే పంట ట్రాక్టర్ గడ్డికి రూ.10వేలు పెట్టి కొనుగోలు చేస్తున్నారు.

గడ్డికి తోలేందుకు ఖర్చు ఎక్కవవుతోంది- ఆర్ల రాములు, రైతు
పశువుల కోసం ట్రాక్టర్ గడ్డిని రూ.10వేలకు కొన్నా. అయితే ఏడాది మొత్తం వచ్చే పరిస్థితి లేదు. కాల్వల కింద ప్రాంతాల నుంచి గడ్డి కొనుగోలు చేసి తీసుకొస్తున్నాం

మిషన్లతో కోయడమే పెద్ద దెబ్బ – వెంకన్న, రైతు చీకటిగూడెం
వరిపొలాలను మిషన్లతో కోయించడం పశువుల మేతకు పెద్ద దెబ్బ పడుతోంది. మనుషులతో కోయిద్దామంటే.. కూలొళ్ల ఇబ్బందికి తోడు లేట్ ప్రక్రియ. మిషన్లతోటి అయితే గంటలో వడ్లు చేతికొస్తాయి.

Tags: paddy crop, reeds, irrigation missions, cattle, tractor hire, blackboard, tractor grass, RS 10 thousand

Next Story

Most Viewed