గుట్టుచప్పుడు కాకుండా మిరప తోటలో గంజాయి సాగు

by  |
Cannabis plantation
X

దిశ, చిన్నగూడూరు: మిర్చి తోటలో గంజాయి సాగు చేస్తున్నారన్న పక్క సమాచారంతో ఎక్సైజ్ శాఖ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం గుండంరాజుపల్లి గ్రామ పరిధిలో తనిఖీలు చేసి, మిర్చి తోటతో సాగు చేస్తోన్న సుమారు రెండొందల గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. తొర్రూరు డీఎస్పీ వెంకటరమణ వివరాల ప్రకారం.. నరసింహులపేట మండలం బొజ్జన్నపేట గ్రామం భీమ్లాతండాకు చెందిన భానోత్ బాలు తండ్రి దేశ్య తన మిర్చి తోటలో గంజాయి సాగు చేస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో దాడులు నిర్వహించి, మొక్కలను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. అనంతరం గంజాయి మొక్కలు సాగు చేస్తోన్న బాలుపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ దాడిలో మరిపెడ సీఐ సాగర్, చిన్నగూడూరు ఎస్ఐ విజయ్ రామ్ కుమార్, నర్సింహులపేట ఎస్ఐ నరేష్, ఎక్సైజ్ సీఐ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Next Story