విచిత్రం… ఎలుకలు మద్యం బాటిళ్లు ఎత్తుకెళ్లాయంట !

by  |
విచిత్రం… ఎలుకలు మద్యం బాటిళ్లు ఎత్తుకెళ్లాయంట !
X

దిశ, న్యూస్‌బ్యూరో: లాక్‌డౌన్ సమయంలో మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా జరిగినట్లు తెలుస్తోంది. సీల్ వేసిన దుకాణాల నుంచి మద్యం మాయమైంది. సంగారెడ్డి జిల్లాలో పలు మద్యం దుకాణాల నుంచి ఏకంగా 230 కాటన్ల మద్యం మాయమైనట్లు అధికారులు గుర్తించారు. అంతేగాక అమ్మకాలు మొదలైన తర్వాత లాక్‌డౌన్ నిబంధనలు పాటించని వైన్‌షాపులపై చర్యలు తీసుకున్నారు. కొన్నిషాపులను నాలుగైదు రోజులు సీజ్ చేయగా… మరికొన్ని దుకాణాలకు జరిమానా విధించారు.

రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం లాక్‌డౌన్ విధించడంతో మందుబాబులు చాలా ఇబ్బందులు పడ్డారు. దీన్ని ఆసరాగా చేసుకున్న వ్యాపారులు బ్లాక్ దందా మొదలు పెట్టారు. దుకాణాలను దొడ్డిదారిన తీసి నాలుగింతలు ధరతో మద్యం అమ్మకాలు చేశారు. అయితే ప్రభుత్వం మద్యం దుకాణాలను అనుమతిచ్చే నాటికి కొన్ని షాపులపై ఫిర్యాదులుండటంతో ఆకస్మిక తనిఖీలు చేసిన అధికారులు సంగారెడ్డి, నారాయణపేట్, వికారాబాద్, రంగారెడ్డితో పాటు పలు జిల్లాల్లో మద్యం మాయమైనట్లు గుర్తించారు. సంగారెడ్డి జిల్లాలో అయితే ఒక కంపెనీకి చెందిన 230 కాటన్ల మద్యం తేడా వచ్చినట్లు తేల్చారు. అయితే దీనికి అధికారులు అడిగిన ప్రశ్నలకు దుకాణదారులు విస్తుపోయే సమాధానాలు ఇచ్చినట్లు సమాచారం. తాళాలు వేసి ఉన్న దుకాణాల నుంచి ఎలుకలు మద్యం ఎత్తుకెళ్లాయని, సీసాలు పగులగొట్టాయంటూ సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. దీనిపై ఆగ్రహించిన అధికారులు రాష్ట్రంలో 60మద్యం దుకాణాలకు నోటీసులు జారీ చేశారు.


Next Story

Most Viewed